- సహనం వందే, ఆర్టికల్ టుడే కథనాలపై ఆరా
- ప్రధాన కార్యాలయానికి ఆకస్మిక రాక
- ఆ సమయంలో అందుబాటులో లేని ఎండీ
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఇటీవల వరుసగా ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లలో వస్తున్న కథనాలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం హైదరాబాదులోని ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయిల్ ఫెడ్ అక్రమాల్లో కొందరు అధికారుల తీరుపై మంత్రి మండిపడినట్లు సమాచారం. ఆ రెండు డిజిటల్ పేపర్లలో కథనాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. తిరుమలేశ్వర్ రెడ్డి దగ్గర నాలుగు విభాగాలు ఎందుకు ఉన్నాయని మంత్రి ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం.
నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి...
ఈ సందర్భంగా మంత్రి సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో నిర్మాణంలో ఉన్న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ సంస్థ ఆర్థికంగా బలోపేతమవుతూ, రైతులకు లాభాలను అందించేలా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. సంస్థ ప్రగతికి, రైతు సంక్షేమానికి సమన్వయంతో పనిచేయాలని ఉద్బోధించారు. కాగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఈడీ, ఓఎస్డీల రోజువారి విధులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాగా వారిని నియమించడం వల్ల సంస్థలోని కొందరు అధికారుల బాధ్యతలకు కత్తెర పడినట్లు అయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఆయిల్ పామ్ నర్సరీల పర్యవేక్షణ…
ఆయిల్ పామ్ నర్సరీల పర్యవేక్షణ సరిగా ఉండాలని, నర్సరీ స్థాయిలోనే మొక్కలను సరిగా గుర్తించాలని, అందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఆయిల్ ఫెడ్ సంస్థ పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ సమీక్షలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, ఈడీ ప్రశాంత్ కుమార్, ఓఎస్డీ కిరణ్ కుమార్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక పర్యటన కావడంతో సంస్థకే కీలకమైనటువంటి ఎండీ యాస్మిన్ భాషా రాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అలాగే నాలుగు విభాగాలను చూస్తున్న తిరుమలేశ్వర్ రెడ్డి కూడా ఆ సమయంలో లేకపోవడం గమనార్హం.