- తెలంగాణ మాజీ వైద్యాధికారికి ధనలక్ష్మిగా మారిన కరోనా
- ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆయన ఇంట్లో కరెన్సీ వర్షం కురిసింది
- కరోనా కాలంలో భారీగా వసూలు చేసిన మాజీ వైద్యాధికారి
- అంత డబ్బు దాయటానికే ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఆ అధికారి
- రెండు ఫ్లాట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయో ఊహించుకోవచ్చు
- బస్తాల్లో తరలించి అందులో దాచిపెట్టిన డాక్టర్
- ఇష్టారాజ్యంగా వసూళ్లు… విదేశాల్లో జల్సాలు… ఇది ఆయన జీవనశైలి
సహనం వందే, హైదరాబాద్:
డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు నాట్యం చేశాయి. బస్తాల కొద్దీ డబ్బులు ఎక్కడ దాచి పెట్టాలో అర్థం కాక రెండు వేరు వేరు అపార్ట్మెంట్లలో రెండు ఫ్లాట్లు కొన్నాడంటే ఎంత డబ్బు ఉందో ఊహించుకోవచ్చు. దాదాపు మూడేళ్ల కరోనా కాలంలో ఆ ఫ్లాట్లన్నీ డబ్బులతో నిండిపోయాయి.
కరోనా కాలంలో ఆ ఇద్దరు వసూలు రాయుళ్లు…
దాదాపు మూడేళ్ల కరోనా కాలంలో ఆయన కోట్లు కూడబెట్టారు. ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, వ్యాక్సినేషన్ కేంద్రాలు… ఇలా వైద్యానికి సంబంధించిన అన్ని సంస్థలను నియంత్రించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చేవి. కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా రోగుల నుంచి లక్షలు లక్షలు వసూలు చేసినప్పటికీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వారిని వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి.

ఉదాహరణకు రాష్ట్రంలో అత్యంత పేరు మోసిన మూడు అక్షరాల పేరున్న ఒక ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. ఘోరమైన తప్పిదం జరిగిందని అందులో రాశారు. కానీ చర్యలు మాత్రం తీసుకోకుండా వదిలేశారు. కోట్ల రూపాయలు ఆసుపత్రి నుంచి ఈ అధికారికి వచ్చి పడ్డాయి. మరోవైపు అనేక ఆసుపత్రుల నుంచి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కొన్ని ఆసుపత్రులు ఆయన మీద ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశాయి. అయితే ఈయన చేసిన వసూళ్లతో పైస్థాయి వారినందరినీ మేనేజ్ చేసే వారన్న చర్చ ఉంది. ఆయన చేసే వసూలు చాలా స్మార్ట్ గా ఉండేవి.
అందుకోసం హైదరాబాదులో నమ్మకమైన ఇద్దరు బంట్లు ఉన్నారు. వారి ద్వారా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్ళేవి. రాష్ట్రంలో ఉన్న వందల ఆసుపత్రుల నుంచి కోట్లు వసూలు చేశారు. కొన్ని ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరించి వసూలు చేశారు. మరో విషయం ఏంటంటే ఆ సమయంలో రెమెడెసివీర్ వంటి కొన్ని కరోనా మందుల కొరత భారీగా ఉండేది. రెమెడెసివీర్ కొన్ని సందర్భాల్లో లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మేవారు. అటువంటి వాటిని కూడా ఈ అధికారి ఆసుపత్రులకు ఇచ్చి కమీషన్లు పుచ్చుకునేవారు. ఇక వ్యాక్సిన్ల పరిస్థితి చూసుకుంటే అది మహా పెద్ద కుంభకోణం. పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలకు వేల డోసులు అమ్ముకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్ అధిక ధరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినప్పటికీ నోరు మూసుకున్నారు. వారి నుంచి కోట్లు తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి కమీషన్లు కొట్టేశారు. కరోనా తీవ్రత వల్ల వాటికి సరైన ఆడిట్ కూడా లేకుండా పోయింది. ప్రపంచం కరోనాతో కన్నీళ్లు పెడుతుంటే… ఈయన మాత్రం కరెన్సీ నోట్లతో ఎంజాయ్ చేశారన్న చర్చ ఉంది. అందుకు ఆయన జీవనశైలి… ఆయనకున్న ఆస్తులు ఇవే నిదర్శనం. ఆయనెవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండవచ్చు.
ఒక్కసారిగా మారిన జీవనశైలి…
కరోనా తీసుకొచ్చిన అదృష్టం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆయన జీవనశైలిలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వేష… భాష… వ్యవహారం అన్నింటిలోనూ ప్రత్యేకతలు వచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆ అధికారి ఒక సెలబ్రిటీగా మారిపోయారు. కరోనా కాలంలో ఏర్పడిన పరిచయాలు అన్నింటినీ ఆయన ఉపయోగించుకున్నారు. రాజకీయ పరిచయాలు గణనీయంగా పెరిగాయి. అధికారి మాజీగా మారిన తర్వాత జీవితంలో ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేశారు… ఇంకా చేస్తూనే ఉన్నారు. విదేశీ ట్రిప్పులు ఆయన విమానం ఎక్కుతున్నాడంటే వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తారు. హైదరాబాద్ సూర్యాపేటకు వెళ్ళినంత ఈజీగా లండన్, అమెరికాలకు వెళ్లి వస్తారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులు కూడా ఈ స్థాయి భోగాన్ని అనుభవించలేరు. మంత్రులు కూడా ఇంత ఎంజాయ్ చేస్తారని అనుకోలేము. వందల కోట్ల రూపాయలు ఆయన ప్లాట్లలో ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బు ఏం చేశారన్నది తదుపరి సంచికలో చర్చిద్దాం.