- సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డిల అసంతృప్తి
- బహుజనులకు ఇవ్వడంపై కుతకుత
- అనేక చోట్ల నిరసనలు… బోధన్ లో పార్టీకి రాజీనామాలు
- రెడ్ల ఆధిపత్యంపై మండిపడుతున్న ఎస్సీ, బీసీ నేతలు
- కులగణన… సామాజిక న్యాయం కేవలం ఉత్తి మాటలేనా?
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం బహుజనులకు అవకాశం కల్పించడంపై రెడ్లు భగ్గుమంటున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు నానా యాగీ చేస్తున్నారు. బోధన్ లోనైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాగే బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయం అంటూ నినాదాలు ఇస్తున్న తరుణంలో… ఆయా వర్గాలకు మంత్రి పదవులు ఇస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉండటంపై బహుజన నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రెడ్ల ఆదిపత్యం ఉందని… వారి జనాభా శాతానితో పోలిస్తే అధికంగానే మంత్రి పదవులు ఉన్నాయని… అంతేగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వర్గానికి చెందిన వారు ఉన్నారని… ఇంతకంటే వాళ్ళకి ఇంకేం కావాలని బహుజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆగ్రహ జ్వాలలు…
మంత్రివర్గ విస్తరణలో బహుజనులైన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు రెడ్లు అసంతృప్తికి లోనయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మంగళవారం బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పంపినట్లు సమాచారం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది.
అజ్ఞాతంలోకి రాజగోపాల్ రెడ్డి...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించినప్పటికీ అవకాశం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన ఫోన్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు రాజీనామా బాట పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వీరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని చెబుతున్నప్పటికీ వారు తమ పంతం వీడడం లేదు. ఈ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ నాయకుల తీరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణలు చూసుకొని పార్టీ నిర్ణయిస్తుందని... దాన్ని అందరూ గౌరవించాల్సిందేనని ఆయన అన్నట్లు సమాచారం. వాళ్లు ఇలాగే ఉంటే ‘డోంట్ కేర్’ అని అన్నట్లు తెలిసింది.