- ఆయనను రప్పించేందుకు ‘పెద్దల’ కృషి
- మంత్రి తుమ్మలతోనూ మంచి సంబంధాలు
- ప్రస్తుత ఎండీ బిజీతో మాజీ ఎండీని రప్పించాలని యోచన
సహనం వందే, హైదరాబాద్:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేందర్ ఆయిల్ ఫెడ్ లోకి మళ్లీ ఎంటర్ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ కు ఆయన దాదాపు మూడేళ్లకు పైగా ఎండీగా పనిచేసి డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లారు. అయితే ప్రస్తుత ఎండీ యాస్మిన్ బాషాకు అనేక ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో ఆమె ఆయిల్ ఫెడ్ పై అంతగా కేంద్రీకరించలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఆమె ఉద్యానశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, మైనారిటీ శాఖ వంటి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫెడ్ కు పూర్తిస్థాయి సమయం కేటాయించడం లేదని అంటున్నారు. పైగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అనేక జిల్లాల్లో విస్తరణ చాలా మందకొడిగా సాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఫ్యాక్టరీల నిర్మాణం చేపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఎండీ అనేక బాధ్యతల్లో బిజీగా ఉండి ఈ కార్పొరేషన్ పై అంతగా దృష్టి సారించడం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎండీగా సురేందర్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోనూ… అలాగే ఇతర పెద్దలతోనూ సురేందర్ కు సంబంధాలు ఉండటం ఆయనకు కలిసి వస్తుంది. ఆయన కూడా ఎండీగా రావాలని భావిస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ లోని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
ఉండాలనుకున్నా ఉండలేక…
సురేందర్ ఎండీగా ఉన్న కాలంలో ఆయిల్ ఫెడ్ లో అనేక కీలకమైన పరిణామాలు జరిగాయి. ఆయిల్ పామ్ విస్తరణ ఆయన హయాంలోనే ప్రారంభమైంది. లక్షలాది మొక్కలు కొనుగోలు చేయడం… నర్సరీలు ఏర్పాటు చేయడం… సిద్దిపేట ఫ్యాక్టరీ టెండర్ల ఖరారు… ఇలా వందల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆయన హాకాకు కూడా ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో హాకాకు చైర్మన్ గా మచ్చా శ్రీనివాసరావు ఉన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి శనిగల టెండర్ దక్కించుకున్నారు. అయితే ఈ టెండర్లు, విక్రయాల్లో పెద్ద గోల్ మాల్ జరిగిందని విమర్శలు వచ్చాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయని కేంద్రం సీరియస్ అయ్యింది. ఒకవైపు ఆయిల్ ఫెడ్ పనుల్లో అక్కడక్కడ అక్రమాలు జరిగాయన్న విమర్శలు… మరోవైపు హాకా శనిగల అక్రమాలు… ఈ రెండింటితో సురేందర్ ఇరుకున పడ్డారు. ప్రభుత్వం కూడా అంతర్గతంగా విచారణ చేపట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ తలనొప్పుల కంటే ప్రశాంతమైనటువంటి మరో బాధ్యతకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో ఉండాలనుకున్న ఉండలేక డిప్యూటీ సీఎం వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. అయితే పరిస్థితులు ప్రస్తుతం అంతా సవ్యంగా ఉన్నాయన్న భావనతో ఆయన తిరిగి ఆయిల్ ఫెడ్ లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆ సీనియర్ అధికారి తెలిపారు. అంతేగాక మంత్రి తుమ్మల ఆశీస్సులు కూడా సురేందర్ కు ఉన్నట్లు అధికారి చెప్తున్నారు. అయితే కొందరు ఆయిల్ ఫెడ్ రైతులు, రైతు సంఘాలు మాత్రం ఆయన రాకను ఒప్పుకునే అవకాశం కల్పించడం లేదు.