- అమెరికాలో చైనా మహిళ అరెస్టు
- భారత్కు ముప్పు పొంచి ఉందా?
- ఫ్యూసేరియం గ్రామినారమ్’ ఫంగస్ ప్రయోగం
సహనం వందే, ఢిల్లీ:
అమెరికాలో వ్యవసాయ ఉగ్రవాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఫంగస్ను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలపై ఒక చైనా మహిళను అరెస్టు చేసినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటన వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ప్రమాదాలను, ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును చాటింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్కు కూడా ఇలాంటి దాడుల వల్ల ముప్పు ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి?
యుంకింగ్ జియాన్ అనే చైనా మహిళ మిషిగన్ యూనివర్సిటీలో పనిచేస్తూ పరిశోధన పేరుతో ఫ్యూసేరియం గ్రామినారమ్ అనే ప్రమాదకర ఫంగస్ను అక్రమంగా అమెరికాకు తీసుకొచ్చారు. ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదానికి ఆయుధం అని అమెరికా న్యాయశాఖ పేర్కొంది. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి వంటి పంటలకు ‘హెడ్ బ్లైట్’ అనే తెగులును కలిగించి, ఏటా వందల కోట్ల రూపాయల నష్టాలను సృష్టిస్తుంది.
వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, ఆహార ఉత్పత్తులను దెబ్బ తీసే లక్ష్యంతో పంటలు లేదా పశువులపై జీవసంబంధమైన ఏజెంట్లను (బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటివి) ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడం. ఇలాంటి దాడులు ఆ దేశ సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తాయి.
కుట్ర కోణం…
ఈ కేసులో జియాన్ ప్రియుడు జున్యోంగ్ లియుపైనా అభియోగాలు మోపారు. చైనా ప్రభుత్వం ఈ ఫంగస్పై పరిశోధనలకు జియాన్కు నిధులు సమకూర్చిందని అమెరికన్ న్యాయశాఖ తెలపడం కుట్ర కోణాన్ని తెలియజేస్తుంది. ఈ ఫంగస్ మనుషులు, జంతువులకు తీవ్ర అనారోగ్యం కలిగిస్తుందని కాష్ పటేల్ వెల్లడించారు. జీవ ఆయుధాలతో యుద్ధం కొత్త కానప్పటికీ, జీవ ఉగ్రవాదం అనే పదం 19వ శతాబ్దంలోనే వాడుకలోకి వచ్చిందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ బ్రిటన్లో బంగాళాదుంప పంటను పురుగులతో నాశనం చేయాలని ప్రయత్నించింది. జంతువులపై ఇలాంటి దాడులు ఎక్కువగా కనిపించాయని వ్యవసాయ నిపుణుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
భారత్కు ముప్పు పొంచి ఉందా?
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఇలాంటి దాడుల వల్ల పెద్ద ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశ జీడీపీలో 20 శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. ప్రమాదకరమైన జీవులు ఇతర దేశాల నుంచి భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఉదాహరణకు లాంటానా కెమారా వంటి పొద మొక్కలు అమెరికా గోధుమలతో పాటు దేశంలోకి ప్రవేశించి అటవీ ప్రాంతాలకు ముప్పుగా మారాయని అంటున్నారు.
ముప్పును ఎదుర్కోవడం ఎలా?
ఇటీవల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసిన దాదాపు ఐదు లక్షల డాలర్ల విలువైన మామిడి పండ్లను తెగుళ్ల కారణంగా నాశనం చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆహార భద్రతకు ముప్పు లేకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ అవసరం. వ్యాధికారకాలను వేగంగా గుర్తించే పరిజ్ఞానం, శానిటరీ, సైటోసానిటరీ నియమాలను ఖచ్చితంగా పాటించడం ముఖ్యమని డీఆర్డీఓ అధ్యయనం చెబుతోంది. భారత విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, బ్యాక్టీరియా లేదా వైరస్లు దేశంలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ ఆహార భద్రతకు పటిష్టమైన నిఘా, నియంత్రణ వ్యవస్థలు అత్యవసరం.