- కన్నడ భాష వివాదం రాజకీయ వ్యూహమా?
- రాబోయే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఎత్తుగడ
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సాధనే ఉద్దేశం
సహనం వందే, చెన్నై:
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కన్నడ భాష పుట్టుక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం తమిళనాడులో ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కన్నడ భాషపై తీవ్ర వివాదం…
‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా కమల్ హాసన్ తమిళం నుంచి కన్నడ పుట్టింది అని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆయన సినిమాను రాష్ట్రవ్యాప్తంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా థగ్ లైఫ్ సినిమా విడుదల, ప్రదర్శనలను నిలిపివేసింది.
న్యాయస్థానంలో చుక్కెదురు…
ఈ వ్యవహారంపై కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. తాను తప్పు చేయలేదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని పేర్కొన్న కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తన థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయవద్దని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. ఇది కన్నడ అభిమానుల ఆగ్రహానికి పరాకాష్టగా నిలిచింది. కమల్ హాసన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించాయి.
రాజ్యసభ ప్రవేశం సుగమం…
మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం మద్దతు తెలిపింది. ఈ పొత్తులో భాగంగా డీఎంకే నేతృత్వంలోని కూటమికి ఎంఎన్ఎం మద్దతు ఇచ్చినందుకు బదులుగా కమల్ హాసన్కు రాజ్యసభ సీటును కేటాయిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. మే 28న డీఎంకే అధికారికంగా ప్రకటించిన ఆరుగురు రాజ్యసభ అభ్యర్థులలో కమల్ హాసన్ పేరు కూడా ఉంది. దీంతో కమల్ హాసన్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. జూన్ 19న తమిళనాడు నుంచి 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాట రాజకీయ మైలేజీ…
కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినప్పటికీ తమిళనాట మాత్రం కమల్ హాసన్కు మంచి ఫాలోయింగ్ లభించింది. తమిళ భాష ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు తమిళ ప్రజల్లో సానుకూల స్పందన లభించింది. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో తన పార్టీని మరింత ముందుకు నడిపించేందుకు ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అంతటా కమల్ హాసన్ పేరు మారుమోగిపోవడంతో ఇది ఆయనకు పెద్ద రాజకీయ మైలేజీని తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఎదురైన వ్యతిరేకతను పక్కన పెడితే, తమిళనాట తన రాజకీయ పురోగతికి కమల్ హాసన్ ఈ వివాదాన్ని వ్యూహాత్మకంగా వాడుకున్నారని స్పష్టమవుతోంది.