ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

  • పనితీరు మార్చుకోవాలని అల్టిమేటం
  • ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదని ఆవేదన

మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని మహేష్ గౌడ్ కుండబద్దలు కొట్టారు.

స్థానిక ఎన్నికలే కీలకం…
“మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాల్సిన అవసరం ఉంద’ని మహేష్ గౌడ్ పదునైన మాటలతో హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన నొక్కి చెప్పారు.

సంక్షేమ పథకాల ప్రచారం ముఖ్యం…
‘పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారంలో ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయి, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాల’ని మహేష్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. “శక్తి వంచన లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదు,” అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. జూన్ మాసంలో పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు. శాస్త్రీయబద్ధంగా కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *