రేపు హైదరాబాదుకు ప్రభాకర్ రావు

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు
  • ఎల్లుండి సిట్ ముందు హాజరు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, అది మంజూరైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 9వ తేదీ ఉదయం సిట్ అధికారుల విచారణకు ఆయన హాజరుకానున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యం…
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాకుండా, స్వపక్షంలోని అసమ్మతి నేతల ఫోన్లను సైతం అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం అంతా అత్యంత రహస్యంగా నడిచింది. 2023 చివరల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.

సిట్ దర్యాప్తు..‌. ప్రభాకర్ రావు పాత్ర
సిట్ దర్యాప్తులో భాగంగా పలువురు పోలీస్ ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో అందరూ ప్రభాకర్ రావు పేరును ప్రస్తావించడంతో, ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. అయితే అప్పటికే విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాలు
మరోవైపు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పించారని, ఈ నేపథ్యంలో తాను ఇండియాకు వస్తే వెంటనే అరెస్ట్ చేస్తారని, ఇబ్బందులకు గురిచేస్తారని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ విచారణకు హాజరై, సిట్ దర్యాప్తు అధికారులకు సహకరిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో సిట్ అధికారులకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ అప్పటికే రద్దు కావడంతో ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది. ఈ వీసా జారీ అయిన మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *