- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
- ఆలయ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు
సహనం వందే, యాదాద్రి:
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీఏ) ఆధ్వర్యంలో విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయడమే కాకుండా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా గుర్తింపు తెస్తామని అన్నారు. టీటీడీ తరహాలో గోశాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలను వైటీడీఏ ఆధ్వర్యంలో విశిష్టంగా అందిస్తామని తెలిపారు. యాదగిరిగుట్టపై భక్తులు నిద్రించే సంప్రదాయాన్ని పునరుద్ధరించామని, తిరిగి యాదగిరిగుట్ట అనే పేరును పెట్టామని, 60 కేజీల బంగారంతో స్వామి వారి విమాన స్వర్ణ గోపురం నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.