సామాన్యులకు సలహాదారు పదవులు
సహనం వందే, అమరావతి:
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అంకారావు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రంలో అడవుల పెంపకంలో ఆయన సేవలు అవసరమని గుర్తించి ఈ నియామకాన్ని చేపట్టిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ ఆసక్తి…
అంకారావు నియామకంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆసక్తి చూపారని, ఆయన సిఫార్సుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పెద్ద నాయకులకే ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కుతాయన్న అపోహను చెరిపేస్తూ, సామాన్యులకు కూడా పదవులు వరిస్తాయని ఈ అనూహ్య నిర్ణయంతో స్పష్టం చేసినట్లైంది.
ఇతర ప్రముఖులకు సలహాదారు పదవులు…
గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించింది. వారిలో ఇస్రో మాజీ ఛైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర ఫణిక్కర్ సోమ్నాథ్ (స్పేస్ టెక్నాలజీ సలహాదారు), పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా (చేనేత, హస్తకళల అభివృద్ధి శాఖ సలహాదారు), డీఆర్డీఓ మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జీ సతీష్ రెడ్డి (ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారు), ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీ (ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారు) ఉన్నారు.