- విజయం ఎంత ముఖ్యమో… మనిషి జీవితం అంతకంటే ముఖ్యమైంది
- బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ గంభీర్ రియాక్షన్ ఇదే..!
సహనం వందే, ముంబై:
బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
రోడ్ షోలపై నమ్మకం లేదు…
‘నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదు. ఇలా జరగడం దురదృష్టకరం. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత ముఖ్యమో, మనిషి జీవితం అంతకంటే ముఖ్యమని నేను ఎప్పుడూ చెబుతుంటాను’ అని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి వేడుకలు జరపడం సరికాదని ఆయన అన్నారు. ఒక మనిషి ప్రాణం పోయినా అది చాలా పెద్ద నష్టమే అని ఆయన ఉద్ఘాటించారు.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదు…
భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గంభీర్ సూచించారు. విజయాలు జరుపుకోవడం తప్పు కాదని, కానీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు. అభిమానులు ఉత్సాహపడటం సహజమేనని, కానీ ఆ ఉత్సాహం నియంత్రణ కోల్పోతే విపత్తులకు దారితీస్తుందని హెచ్చరించారు. తగిన భద్రత, సన్నద్ధత లేకపోతే ఇలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని గంభీర్ అన్నారు.
బెంగళూరు ఘటన… ప్రశ్నల వర్షం
ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది అభిమానులు అనూహ్యంగా తరలివచ్చారు. దీనివల్ల ఏర్పడిన అపసవ్య పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటన భారతదేశంలో జరిపే భారీ వేడుకల నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. భద్రతా ఏర్పాట్లు, జన సమూహాన్ని నియంత్రించే విధానాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరుపై లోతైన సమీక్ష అవసరమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.