- గతేడాది జొన్నలను ఇప్పుడు అత్యంత తక్కువకు అమ్మిన ఫలితం
- రైతుల నుంచి కొన్న ధరతో పోలిస్తే క్వింటాలుకు రూ. వెయ్యి నష్టం
- గత సంవత్సరం జొన్నల మద్దతు ధర రూ. 3,180 కాగా… రూ. 2,141కే కట్టబెట్టారు
- ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూ. 2,800… ఈ లెక్కన చూసినా కనీసంగా రూ. 60 కోట్ల భారీ నష్టం
- మార్క్ ఫెడ్ ను ముంచేసిన వ్యాపారులు… చోద్యం చూస్తున్న అధికారులు
సహనం వందే, హైదరాబాద్:
మార్క్ ఫెడ్ అధికారుల నిర్వాకం వల్ల ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. కొందరు అధికారులు వ్యాపారులతో సిండికేట్ కావడం వల్లనే నష్టాలు మూటగట్టుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు తాజాగా జొన్నల విక్రయంలో జరిగిన లావాదేవీలే నిదర్శనం. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను వ్యాపారులకు అమ్మడం ద్వారా మార్క్ ఫెడ్ కు ఏకంగా రూ. 93 కోట్లు నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది జొన్నల మద్దతు ధర రూ. 3,180 ఉంది. ఆ ప్రకారం రైతుల నుంచి 93 లక్షల క్వింటాళ్ల జొన్నలను మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. అయితే వాటిని ఏడాది తర్వాత క్వింటాలుకు రూ. 2,141 చొప్పున వ్యాపారులకు విక్రయించడం వల్ల రూ. 93 కోట్లు నష్టం జరిగినట్లు తేలింది. ఒకవేళ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం చూసినప్పటికీ ఏకంగా రూ. 60 కోట్ల పైబడి నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఏడాదిగా కాలయాపన చేసి…
గత ఏడాది యాసంగిలో పండిన జొన్నలను కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్… ఏడాదిపాటు వాటిని విక్రయించకుండా గోదాముల్లోనే ఉంచడం మార్క్ ఫెడ్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. జొన్నలను ఎక్కువ కాలం గోదాముల్లో ఉంచడం వల్ల పురుగుపడతాయి. పిండి అవుతాయి. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఏడాదిపాటు అలాగే గోదాముల్లో ఉంచారు. ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచారు. కానీ సరైన ధర రాలేదని వాటిని రద్దు చేశారు. ఇలా రెండుసార్లు టెండర్లు రద్దయ్యాయి. ఇప్పుడు మూడోసారి టెండర్లను ఫైనల్ చేశారు. ఆరు నెలల క్రితం ధర కంటే ఇప్పుడు రూపాయిన్నర మాత్రమే అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే గొప్ప ధర వచ్చినట్లు భావిస్తున్నారు. వాస్తవంగా బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ జొన్నల ధర దాదాపు రూ. 2,800 నుంచి రూ. 3 వేల వరకు ఉంది. ప్రస్తుతం రైతుల నుంచి మార్క్ ఫెడ్ రూ. 3,371కు కొనుగోలు చేస్తుంది. అలాంటిది వ్యాపారులకు మాత్రం రూ. 2,141కు కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తుంది. ఇంత తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏడాదిపాటు ఏం చేశారు? కొందరు అధికారులు, వ్యాపారులు సిండికేట్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
నష్టాల్లో కూరుకుపోతున్న మార్క్ ఫెడ్…
మార్క్ ఫెడ్ ఇప్పటికే వేల కోట్ల రూపాయల్లో అప్పుల్లో కూరుకుపోయి ఉంది. వాటికి ప్రతినెల వడ్డీలు కట్టడం… ఇలాంటి విక్రయాలు జరిగినప్పుడు అసలు చెల్లించడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల అప్పులు తగ్గకపోగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఏడాదికాలంగా జొన్నలను అమ్మక పోవడం వల్ల వచ్చిన నష్టంతో పాటు… వాటిని ఇన్నాళ్లపాటు గోదాముల్లో ఉంచడం వల్ల నిర్వహణ ఖర్చు కూడా భారీగా ఉంటుంది. అసలు ఇన్నాళ్లపాటు అమ్మకుండా ఉండాల్సిన అవసరం ఏంటి? మార్క్ ఫెడ్ అధికారులతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మార్క్ ఫెడ్ లోని కొందరు అధికారులు కావాలనే ఇలా కాలయాపన చేశారన్న విమర్శలు ఉన్నాయి.
రెండుసార్లు టెండర్లు రద్దు చేశాం: శ్రీనివాస్ రెడ్డి, ఎండీ, మార్క్ ఫెడ్
జొన్నలను ఏడాది వరకు విక్రయించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరైన ధర రాకపోవడం వల్ల రెండు సార్లు టెండర్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మూడోసారి రూపాయిన్నర అధికంగా టెండర్లలో ధర పలికింది. దీంతో జొన్నలను విక్రయించాం. వాటిని వ్యాపారులు త్వరలోనే గోదాముల నుంచి తీసుకెళ్తారు.
మార్క్ ఫెడ్ లో కమీషన్ల పర్వం?
- ఎవరికి ఎంతెంత ముడుతుంది?
- కీలక పాత్రధారులు, సూత్రదారులు ఎవరు?
రేపటి సంచికలో ప్రత్యేక కథనం…