ఆర్థికమా? అధికారమా?

  • కవిత కేటీఆర్ మధ్య పోరుకు ఆస్తులే కారణం
  • జగన్-షర్మిల వివాదాల వెనుక కూడా అదే
  • తండ్రి కేసీఆర్ తోనూ కవిత తెగతెంపులు
  • ఎన్టీఆర్ కు బాబు… ములాయంకు అఖిలేష్ వెన్నుపోటు
  • ప్రజాసేవ లేదు మన్నూ లేదు… సిద్ధాంతం లేదు రాద్ధాంతం లేదు
  • బంధాలకే విలువివ్వని నాయకులు ప్రజలకేం చేస్తారు?

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో జగన్, షర్మిల మధ్య కూడా ఆస్తులు, అధికారమే కేంద్రంగా ఘర్షణ జరిగిందని అర్థం చేసుకోవాలి.

కవిత వర్సెస్ కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీలో కవిత, ఆమె సోదరుడు కేటీఆర్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వేల కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారంపైనే అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కేటీఆర్‌కు విదేశాల్లో భారీగా ఆస్తులు ఉండటం, బీఆర్ఎస్ పార్టీకి వేయి కోట్లకు పైగా ఆస్తులు కేటీఆర్ చేతిలో ఉండటంపై కవిత భగ్గుమంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడబెట్టిన అక్రమాస్తుల్లో 50 శాతం వాటా కోసం కవిత పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దుబాయ్ బ్యాంక్ లాకర్లలో కోట్ల విలువైన డైమండ్స్, రాష్ట్రంలో సువిశాలమైన ఫామ్ హౌస్ లు కేటీఆర్ చేతిలో ఉన్నాయి. కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన కమీషన్లు, మలేషియా, యూఎస్ కంపెనీలతో చీకటి ఒప్పందాల ద్వారా ఈ ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలున్నాయి.

జగన్, షర్మిల మధ్య జరిగింది కూడా అదే…
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల మధ్య జరిగిన విభేదాలు కూడా ప్రధానంగా ఆస్తుల వివాదంగానే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల వైసీపీ కోసం శ్రమించినా, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విభేదాలకు ఆస్తుల పంపకాలు, పార్టీలో అధికార పంపకాలు ప్రధాన కారణాలయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. వీరి మధ్య అధికారం, ఆస్తుల కొట్లాట తప్ప అంతకుమించి ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.

ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు…
కవిత-కేటీఆర్, జగన్-షర్మిల వివాదాలు, గతంలో చంద్రబాబు, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకుల అధికార పోరాటాలు – రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు కేవలం ఆర్థిక, రాజకీయ సంబంధాలుగా మారిపోతున్నాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. లక్ష్మీపార్వతి చేతికి పోనీకుండా పార్టీని తన వైపు తిప్పుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తన మామకు వెన్నుపోటు పొడిచారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తుంటారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ వెన్నుపోటు పొడిచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇలా రాజకీయాల్లో వెన్నుపోట్లు అధికారం కోసమే జరుగుతున్నాయి. పలు దేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఘోరమైన హత్యలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. పెట్టుబడిదారి సమాజంలో రాజకీయాల్లో పదవీకాంక్ష ఆస్తుల గొడవ తప్ప మరొకటి ఉండదు. ప్రజాసేవ లేదు మన్నూ లేదు… సిద్ధాంతం అంటే ఏంటో కూడా ఈ నాయకులకు అసలే తెలియదు. పదవి సంపాదించటం ఆస్తులు కూడబెట్టడమే వీళ్ళ సిద్ధాంతం.

రాజకీయాల్లో నైతికత ఎక్కడ?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇప్పుడు కుటుంబ వివాదాలతో కలకలం రేపుతున్నాయి. ప్రజల కోసం పనిచేస్తామని చెప్పుకునే నాయకులు, సొంత కుటుంబ సభ్యులనే గౌరవించలేకపోతే, వారు ప్రజల కోసం ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యంలో నాయకుల నైతిక బాధ్యతను ప్రశ్నిస్తూ, రాజకీయాలు కేవలం అధికార ఆటగా మారిపోయాయనే సందేశాన్ని అందిస్తున్నాయి. నయీం ఆస్తులు, డైమండ్స్ లెక్క ఎక్కడ, వేల కోట్ల బంగారం ఎటుపోయింది వంటి అంశాలపై కవిత నిలదీయడం ప్రస్తుత రాజకీయాల్లో ఆర్థిక ప్రయోజనాలే కీలకమనే వాదనకు బలం చేకూరుస్తుంది. ఈ పరిణామాలు ప్రజాస్వామ్య విలువలను, నాయకుల నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *