…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

  • మంత్రుల సామంత రాజ్యాలుగా డిపార్ట్మెంట్లు
  • మంత్రుల ఇష్టారాజ్యంపై రేవంత్ అసంతృప్తి!
  • సీఎం జోక్యాన్ని ధిక్కరిస్తున్న మంత్రులు
  • మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసన యోచన
  • ఉపముఖ్యమంత్రి భట్టిని కలవడం కనాకష్టం
  • సెక్రటేరియట్ లో ఆయన చాంబర్ వద్దకు వెళ్లడమూ కష్టమే

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే మంత్రివర్గ విస్తరణలో కొందరు మంత్రులకు ఉద్వాసన, శాఖల మార్పు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

టెండర్ల రగడ… మంత్రి ధిక్కారం
తెలంగాణలో మంత్రులు ముఖ్యమంత్రి జోక్యాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక కీలక శాఖకు చెందిన మంత్రి తన శాఖలో టెండర్లు పిలిచిన సందర్భంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ మంత్రి సీఎం సూచనలను పట్టించుకోకుండా ధిక్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన సీఎం రేవంత్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, ఆ మంత్రికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా దూరంగా ఉంచుతున్నారని సమాచారం. ఈ వివాదం మంత్రివర్గంలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కొందరు మంత్రులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి.

డిప్యూటేషన్‌లలో మంత్రుల ఇష్టారాజ్యం…
కొందరు మంత్రులు తమ శాఖల్లో డిప్యూటేషన్‌ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు డిప్యూటేషన్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారని, అయితే సీఎం పేరు చెప్పుకొని తమ సన్నిహితులకు ఇష్టమొచ్చినట్లుగా డిప్యూటేషన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం శాఖల్లో అసంతృప్తిని పెంచడమే కాక, ప్రభుత్వ యంత్రాంగంలో పనితీరును దెబ్బతీస్తోంది. ఉదాహరణకు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీషన్లు ఇవ్వడం లేదని అధికారులు చెబుతుంటారు. కానీ కొందరికి మాత్రం అవుతుంటాయి. అదేంటని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన ఆబ్లికేషన్ అని చెప్తుంటారు. ఈ విషయం సంబంధిత మంత్రికి తెలుసా లేదా అంతుపట్టడం లేదని అధికారులు గుసగుసలాడుతున్నారు.

ఓ మంత్రి భార్య కనుసనల్లో పాలన?
ఒక కీలక మంత్రి తన నివాసంలోనే ఒక కౌంటర్ ఓపెన్ చేసినట్లు సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి భార్య కనుసనల్లో శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరుగుతున్నాయనే విషయం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఈ మంత్రి శాఖను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

భట్టిని కలవడం అసాధ్యం…!
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. సచివాలయంలో తన ఛాంబర్‌కు వెళ్లే దారిని ముఖ్యమంత్రి తరహాలో తయారు చేసుకోవడం, బారికేడ్లు ఏర్పాటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తుంది. అపాయింట్‌మెంట్ లేకుండా ఎవరూ ఆయనను కలవలేని పరిస్థితి సృష్టించడం విమర్శలకు దారితీసింది. భట్టి సన్నిహితులు కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఆయన లేనప్పుడైనా సెక్రటేరియట్ లో అధికారులను కలిసి సమస్యను విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయనను కలవడం ప్రయాసగా మారిందని, సమస్యలను చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది.

సీఎం ఆదేశాలు లెక్కచేయని మంత్రులు…
కొందరు మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ వ్యాఖ్యలతో సంచలనం సృష్టించడం సీఎం రేవంత్ రెడ్డిని కలవరపెడుతోంది. ఈ వైఖరి ప్రభుత్వంలో ఏకీభావాన్ని దెబ్బతీస్తోందని, పార్టీ ఇమేజ్‌కు హాని కలిగిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపి, మంత్రివర్గ విస్తరణలో కొందరు మంత్రులను తొలగించాలని, కొందరికి శాఖలను మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మంత్రుల పనితీరుపై సాక్ష్యాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి సమర్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *