- కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నదెవరు?
- అధికార కాంగ్రెస్ కీలక నేత అండతోనేనా?
- ఏపీలో షర్మిల ఎలాగో… ఇక్కడ కవిత అలాగే
- బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట
- కేటీఆర్, కేసీఆర్ ఒకటి… హరీష్… కవిత వేర్వేరు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంతలా కవిత తన తండ్రిపై అసంతృప్తికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. తనను పార్టీ వర్గాలే పనిగట్టుకుని ఓడించాయని… ప్రాధాన్యం ఇవ్వడంలేదని… కేటీఆర్ ని నెత్తిన పెట్టుకుంటున్నారని... బీజేపీ తనని జైలులో పెడితే ఆ పార్టీ పట్ల సానుకూల వైఖరి చూపిస్తున్నారని కవిత భావిస్తున్నట్లు… అందుకే ఇంత రాజకీయ దుమారం లేపినట్లు విశ్లేషకుల అభిప్రాయం. అయితే కవితకు అన్ని రకాలుగా అడ్డదండలిచ్చి ఎగదోస్తున్నది ఎవరు అన్నది అనేక మందిలో మెదులుతున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల ఎలాంటి పోరాటం చేస్తున్నారో… అచ్చం అలాగే తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన కూతురు కవిత అలాగే పోరాటం చేస్తున్నారు. షర్మిలకు అండదండలు ఇచ్చింది ఎవరో రాజకీయ వర్గాల్లో అందరికీ తెలుసు. అచ్చం అలాగే తెలంగాణలో కూడా కవితకు అటువంటి అండదండలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక కీలక నేత సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కీలక నేత ఆడిస్తున్నట్లు కవిత నడుచుకుంటున్నారని సెక్రటేరియట్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
తండ్రిపై ఫైర్…
పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాట్లాడడం పట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘బీజేపీ వల్ల నేను గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని గట్టిగా మాట్లాడి ఉంటే బాగుండేద’ని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కాంగ్రెస్ చేసిన ప్రచారం పార్టీ ఇమేజ్ను దెబ్బతీసిందని కవిత ఆరోపించారు. పార్టీలో సీనియర్ నేతలను పక్కనపెట్టి, కొత్త నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై నోరుమెదపలేదేం?
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం వంటి సాంస్కృతిక అంశాలపై కేసీఆర్ నోరు మెదపకపోవడంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి చెప్పి, కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రసంగం ఆశించాం. కానీ ఓరల్గా కూడా ఎక్కువ పంచ్ లేకపోవడం నిరాశపరిచింద’ని ఆమె లేఖలో విమర్శించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.
మూడు ముక్కలు… చివరికి రెండు ముక్కలు?
కవిత లేఖ తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి మరింత తీవ్రమైంది. పలువురు సీనియర్ నేతలు కవిత వైఖరికి మద్దతు తెలిపారని, కానీ కేసీఆర్ ఈ లేఖపై ఇంతవరకు స్పందించలేదని సమాచారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం క్షీణిస్తున్న తరుణంలో, కవిత లేఖ పార్టీలో కొత్త చర్చలకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, బీఆర్ఎస్ను రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మూడు ముక్కలాట ప్రారంభమైంది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్ ఉండగా… వేర్వేరుగా హరీష్ రావు, కవితలు ఉన్నారు. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు… కేసీఆర్, కేటీఆర్ లపై హరీష్ రావు, కవిత అసంతృప్తితో ఉన్నారు. చివరకు వీరిద్దరూ వారిద్దరిపై కలిసికట్టుగా పోరాటం చేసిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు…
కవిత లేఖ బీఆర్ఎస్లో ఒక కొత్త రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసింది. పార్టీ అధినాయకత్వంపై సొంత కూతురు నుంచే కేసీఆర్ కు ఇంత ఘాటైన విమర్శలు రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది. కేసీఆర్ ఈ లేఖకు ఎలా స్పందిస్తారు? పార్టీలో సంస్కరణలు చేపడతారా? లేక ఈ సంక్షోభం మరింత ముదురుతుందా? రాబోయే రోజుల్లో తేలనుంది.