ఐయ్యా’ఎస్’… నీ కాల్మొక్తా!

  • ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు హేయం
  • రాజ్యాంగానికి అవమానంగా వ్యవహారం
  • సీఎం, మంత్రుల వద్ద సాగిలపడుతున్నారు
  • తాజాగా అచ్చంపేటలో సీఎం కాళ్లు మొక్కిన ఐఏఎస్ శరత్
  • అనేకమంది ఐఏఎస్ ల తీరు ఇదే… పరోక్షంగా ప్రోత్సహిస్తున్న నేతలు

ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి, తమ గౌరవాన్ని తామే పణంగా పెడుతున్నారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సర్వీసులు ప్రజాసేవ కోసం ఉద్దేశించినప్పటికీ, కొందరు అధికారులు మంచి పదవులు, అక్రమ లాభాల కోసం రాజకీయ నాయకులకు దాస్యం చేస్తూ, బ్యూరోక్రసీకి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా తెలంగాణలోని అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కిన ఘటన ఈ అనైతిక సంస్కృతిని మరోసారి బట్టబయలు చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాష్ట్ర అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

బ్యూరోక్రసీలో లొంగుబాటు సంస్కృతి…
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల పట్ల లొంగుబాటు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాళ్లు పట్టుకున్న ఐఏఎస్ అధికారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2018లో ఒక ఐఏఎస్ అధికారి, రాజకీయ సభలో కేసీఆర్‌ కాళ్ళు మొక్కడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి చర్యలు కేవలం తెలంగాణకే పరిమితం కాదు. ఉత్తరప్రదేశ్‌లో 2020లో ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ నాయకుడి కాళ్లు పట్టుకోవడం, మధ్యప్రదేశ్‌లో ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి ఆదేశాలకు తలొంచడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చర్యల వెనుక మంచి పదవులు, ప్రమోషన్లు లేదా అక్రమ లాభాల కోసం రాజకీయ నాయకులను సంతృప్తి పరచాలనే ఉద్దేశం ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి లొంగుబాటు సంస్కృతి బ్యూరోక్రసీలో స్వతంత్రతను, నిష్పాక్షికతను దెబ్బతీస్తోంది.

అచ్చంపేట ఘటన… రగిలిన వివాదం
తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో ఐఏఎస్ అధికారి శరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లను మొక్కిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. సౌర గిరి జల వికాస యోజన గురించి సీఎం ప్రసంగించిన ఈ సభలో, ఫోటోలు దిగుతున్న సమయంలో ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ దృశ్యం కెమెరాలో చిత్రీకరణ అయి, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్యను గమనించకుండా వెళ్లిపోయినప్పటికీ నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘ఐఏఎస్ అధికారి హోదా ఏమైపోయింది? ఇలాంటి చీప్ చర్యలతో బ్యూరోక్రసీ ప్రతిష్టను దిగజార్చడం సిగ్గుచేటు,’ అని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఐఏఎస్ అధికారుల ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. బహిరంగంగానే ఇలా కాళ్లం మొక్కుతున్న ఈ ఉన్నతాధికారులు, సీఎం ఒంటరిగా ఒక గదిలో ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారాలు చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అనేకమంది అలాగే చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

సీఎస్ హెచ్చరిక…
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాజకీయ సభల్లో అధికారులు అనుచితంగా ప్రవర్తించడం ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి చర్యలు ప్రజల్లో బ్యూరోక్రసీపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. 1968 ఏఐఎస్ నిబంధనలను ఉల్లంఘించిన ఎవరైనా కఠిన శిక్షను ఎదుర్కొంటార’ని రామకృష్ణారావు హెచ్చరించారు. శరత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసిన ఆయన, రాజకీయ నాయకులతో సంబంధాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ హెచ్చరిక బ్యూరోక్రసీలో సంస్కరణలకు ఒక అడుగుగా భావించవచ్చు, కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

లొంగుబాటు సంస్కృతికి అంతం పలకాలి…
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారి నిష్పాక్షికత ప్రజాసేవకు కీలకం. అయితే కొందరు అధికారులు మంచి పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం రాజకీయ నాయకులకు లొంగిపోతూ, తమ వృత్తి గౌరవాన్ని దిగజార్చడం ఆందోళనకరం. అచ్చంపేట ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు బ్యూరోక్రసీలోని లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. ప్రజలు ఐఏఎస్ అధికారులను గౌరవంతో చూసే బదులు, వారి లొంగుబాటు వైఖరిని చూసి అసహ్యించుకుంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *