‘సుప్రీం’పై కుల వివక్ష

  • సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కులోన్మాదుల దుశ్చర్య
  • మహారాష్ట్రలో ప్రోటోకాల్ పాటించని సీఎస్, డీజీపీ, ఇతర యంత్రాంగం
  • జస్టిస్ గవాయి సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువ
  • దేశానికి సిగ్గుచేటు… ఉన్నత పదవులకూ తప్పని అవమానాలు
  • గతంలో మాజీ రాష్ట్రపతి కోవిందుకూ తప్పని కుల వివక్ష

భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు ఆచరణలో ఎలా అడుగంటిపోతున్నాయో అర్థం చేసుకోవాలి.

జస్టిస్ గవాయికి అవమానం…
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు స్వీకరించిన రెండో దళిత వ్యక్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. జస్టిస్ గవాయి సీజేఐగా నియమితులైన తర్వాత ఆయన స్వరాష్ట్రం మహారాష్ట్రలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ వంటి ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి, అదీ దేశంలో అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన వ్యక్తికి లభించాల్సిన కనీస ప్రోటోకాల్, గౌరవం కూడా లభించకపోవడం దారుణం. ఇది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు. ఒక రాజ్యాంగ పదవికి, ఆ పదవిని అధిష్టించిన దళిత వ్యక్తికి జరిగిన కుల అవమానం.

జస్టిస్ గవాయి ఆవేదన…
ఈ సంఘటనపై జస్టిస్ గవాయి ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడటం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాన’ని అన్నారు. ఇదే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐగా స్వరాష్ట్రానికి వెళ్లినప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తగిన గౌరవం ఇచ్చారు. ఈ వ్యత్యాసం కుల వివక్షను చూపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు, భారత రాజ్యాంగ విలువలకు, సమానత్వ సిద్ధాంతానికే జరిగిన చేదు అనుభవం.

మాజీ రాష్ట్రపతి కోవింద్‌కూ తప్పని వివక్ష!
దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దళిత సమాజానికి చెందినవారు. ఆయన కూడా కుల వివక్ష నుండి తప్పించుకోలేకపోయారు. 2017లో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒడిశాలోని జగన్నాథ ఆలయం సందర్శించారు. ఆలయంలోని పండితులు ఆయనను లోపలికి అనుమతించకుండా, దర్శనాన్ని అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికే ఈ విధమైన అవమానం జరగడం, దేశంలో కుల వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవాలయాల్లో అంటరానితనం ఇంకా రాజ్యమేలుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థాయిలో ఉన్నా, కుల మూలాలు ఆధిపత్య వర్గాల దురహంకారానికి లక్ష్యంగా మారుతాయని ఈ సంఘటన నిరూపించింది.

రాజ్యాంగం హక్కుల అమలులో దగా?
భారత రాజ్యాంగం దళితులకు, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అంటరానితనం వ్యతిరేక చట్టాలను అమలు చేసింది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించి దాన్ని ఏ రూపంలోనైనా పాటించడాన్ని నేరంగా పరిగణించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, 1989 వంటి కఠిన చట్టాలు కూడా అమలులో ఉన్నాయి. అయితే ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాలలో చేర్చాలన్న ప్రతిపాదన 1997లో కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ, పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. ఇది కుల వివక్షతో పాటు, మతపరమైన వివక్షను కూడా సూచిస్తుంది. రాజ్యాంగ హక్కులు కాగితాలకే పరిమితమై, ఆచరణలో వివక్ష కొనసాగడం విచారకరం. చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోవడం, సామాజికంగా మార్పు రాకపోవడం వల్లనే ఈ వివక్ష కొనసాగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *