మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

  • బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు పాజిటివ్‌
  • మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ కేసులు

కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ‘జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి’ అంటూ ఆమె సూచించారు.

కోలుకోవాలని ఆకాంక్ష…
ఈ పోస్ట్‌కు స్పందించిన నమ్రత, తన సోదరి త్వరగా కోలుకోవాలని ప్రేమతో కూడిన ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటీమణులు సోనాలి బింద్రే, సోనాక్షి సిన్హా, డయానా పాండే తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు నెటిజన్లు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 90వ దశకంలో బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శిల్పా శిరోద్కర్, ఇటీవల హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో పాల్గొన్నారు. అలాగే పలు ప్రకటనలు, ఫోటో షూట్‌లు చేస్తూ వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు.

కరోనా రీఎంట్రీ…
దాదాపు ఐదేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. అనేక దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని భయపెట్టిన ఈ మహమ్మారి ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది చైనాలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కలకలం సృష్టించినా, తర్వాత తగ్గింది. కరోనా ప్రపంచం నుండి పూర్తిగా అంతరించిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *