- రేస్ కోర్స్లో గుర్రం సంచలనం
- మొండి గుర్రం… ఎట్టకేలకు విజయం
సహనం వందే, బాల్టీమోర్:
గుర్రపు పందేలంటే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. క్షణక్షణానికో మలుపు తిరిగే ఈ రేస్ల్లో ఒక్కోసారి ఊహించని విజయాలు నమోదవుతుంటాయి. సరిగ్గా అలాంటి సంచలనమే ఆదివారం మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ పిమ్లికో రేస్ కోర్స్లో జరిగింది. 150వ ప్రీక్నెస్ స్టేక్స్లో జర్నలిజం అనే గుర్రం అద్భుతమైన కంబ్యాక్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రేస్ మధ్యలో మరో గుర్రంతో ఢీకొని ట్రాక్ తప్పే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఈ గుర్రం, చివరి క్షణాల్లో మెరుపు వేగంతో దూసుకొచ్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఢీకొట్టినా వెనక్కి తగ్గని మొండి గుర్రం!
కెంటుకీ డెర్బీలో రెండో స్థానంలో నిలిచిన జర్నలిజం, ఈ ప్రతిష్టాత్మకమైన ప్రీక్నెస్ స్టేక్స్లో ఫేవరెట్గా బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టే రేస్ సాగుతుండగా ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. గోల్ ఓరియెంటెడ్ అనే గుర్రం జర్నలిజంను ఢీకొట్టింది. దాంతో జర్నలిజం ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ట్రాక్ నుంచి పక్కకు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో అందరూ జర్నలిజం గెలుపు అవకాశాలు అయిపోయాయని అనుకున్నారు. కానీ జాకీ ఉమ్బెర్టో రిస్పోలి తన అద్భుతమైన నైపుణ్యంతో గుర్రాన్ని మళ్లీ ట్రాక్పైకి తీసుకురావడమే కాకుండా దాన్ని ముందుకు ఉరికించాడు.
చివరి క్షణాల్లో మెరుపులా దూసుకొచ్చిన విజయం!
జర్నలిజం వెనకబడిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో అసలు కథ మొదలైంది. జాకీ ప్రోత్సాహంతో జర్నలిజం ఒక్కసారిగా తనలోని అసలైన వేగాన్ని చూపించింది. లాంగ్షాట్గా బరిలోకి దిగిన గోస్గర్ దూకుడుగా ముందుకు వెళ్తుండగా, జర్నలిజం మెరుపులా దూసుకొచ్చి ఫినిష్ లైన్కు కొద్ది క్షణాల ముందు దాన్ని అధిగమించింది. ఈ అనూహ్యమైన విజయాన్ని చూసి రేస్ కోర్స్లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు.
యజమాని ఆనందం చెప్పనలవి కాదు!
ఈ అద్భుత విజయం తర్వాత జర్నలిజం శిక్షకుడు మైఖేల్ మెక్కార్తీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘మూడు-పదహారవ పోల్ వద్ద చాలా గందరగోళం జరిగింది. ఆ క్షణంలో మేం రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ ఈ గుర్రం పట్టుదల అసాధారణం,’ అని అన్నారు. యజమాని ఆరోన్ వెల్మన్ మాట్లాడుతూ, ‘జర్నలిజం మానసికంగా, శారీరకంగా అసాధారణమైన గుర్రం. ఈ విజయం దాని ఛాంపియన్షిప్ లక్షణాలను చాటింది,’ అని గర్వంగా చెప్పారు.
ట్రిపుల్ క్రౌన్పై అందరి దృష్టి!
ప్రీక్నెస్ స్టేక్స్ అనేది హార్స్ రేసింగ్ ట్రిపుల్ క్రౌన్లో రెండో ముఖ్యమైన ఘట్టం. ఈ ఏడాది కెంటుకీ డెర్బీ విజేత సావరినిటీ తర్వాతి బెల్మాంట్ స్టేక్స్ కోసం సిద్ధమవుతుండటంతో ఈ రేస్లో పాల్గొనలేదు. చర్చిల్ డౌన్స్ నుంచి కేవలం మూడు గుర్రాలు మాత్రమే ఈ రేస్లో పోటీపడ్డాయి. ఇక అందరి దృష్టి ట్రిపుల్ క్రౌన్పైనే ఉంది.