- దళారుల దోపిడీతో రైతుల గోస
- కమీషన్ల మత్తులో మార్క్ఫెడ్ అధికారులు
- పొరుగు రాష్ట్రం నుంచి అక్రమ రవాణా
- తాంసిలో పట్టుబడ్డ ముక్కిపోయిన జొన్నలు
- విమర్శలు వచ్చినా యంత్రాంగం బేఖాతర్
- ఉద్యోగులకు అంత ధైర్యం ఎక్కడిది?
- కింది నుంచి పై వరకు పంపకాలే కారణం
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు.
మార్క్ఫెడ్ ముసుగులో మాయాజాలం!
మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 608 జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి దళారులకు పండగే. రైతుల పేరుతో వారి పాస్పుస్తకాలు, ఆధార్ కార్డులు వాడుకుని యథేచ్ఛగా జొన్నలు అమ్ముకుంటున్నారు. ఎకరాకు 14 క్వింటాళ్ల పరిమితిని తుంగలో తొక్కి, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, మార్క్ఫెడ్ అధికారుల అండతో ఈ దందా సాగిస్తున్నారు. ఈ కుట్రలో అందరి వాటా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రం నుంచి అక్రమ రవాణా!
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు అక్రమంగా జొన్నల రవాణా కొనసాగుతోంది. అక్కడ క్వింటాల్ రూ.2200 ఉంటే, మన రాష్ట్రంలో మద్దతు ధర రూ. 3371 ఉంది. దీంతో ఒక్కో క్వింటాల్పై రూ.1150 లాభం దళారుల పాలిట కాసులు కురిపిస్తోంది. రాత్రికి రాత్రే లారీల కొద్దీ జొన్నలు తరలించి, గ్రామాల్లో నిల్వ చేసి, ఇక్కడి రైతుల పేరుతో అమ్ముకుంటున్నారు. ఈ అక్రమ రవాణా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాంసిలో పట్టుబడ్డ ముక్కిపోయిన జొన్నలు!
తాంసి కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో 136 క్వింటాళ్ల పాత, బూజు పట్టిన జొన్నలు పట్టుబడటం రైతులను ఆగ్రహానికి గురిచేసింది. రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. పోలీసులు సైతం ఈ జొన్నలు ఎవరివో, ఎవరు తెచ్చారో స్పష్టంగా చెప్పడం లేదు. 272 బస్తాల జొన్నలను సీజ్ చేశామని చెబుతున్నా, అసలు దోషులెవరో మాత్రం బయటకు రావడం లేదు.
కమీషన్లు పిండడంలో ఆ ఇద్దరు దిట్ట…
కొందరు అధికారుల కనుసన్నల్లో కమీషన్ దందా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటాల్కు రూ. 200 నుంచి రూ. 300 వరకు ముడుపులు తీసుకుని దళారులకు ఆ ఉద్యోగులు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇచ్చోడ నుంచి తాంసి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. .

ఆ జిల్లాలో ఒక కీలకమైన మార్క్ ఫెడ్ అధికారి ఈ దందాకు నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మరో అధికారి మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ పై స్థాయి అధికారులను తమ నియంత్రణలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా జొన్నల అక్రమ దందా మొదలుపెట్టినట్టు సమాచారం.
ఏ పంట కొనుగోలు చేసినా అందులో కమీషన్లు పిండడంలో వీళ్ళు దిట్ట. అయితే ఉన్నతస్థాయి అధికారులు వీరికి స్వేచ్ఛ ఇవ్వడం గమనార్హం