సీపీఆర్’హూ’?

  • ఈ పదవి కోసం హోరాహోరీ!
  • బరిలో ప్రముఖ మీడియా దిగ్గజాల్లోని జర్నలిస్టులు
  • ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి నుంచి కూడా ప్రయత్నాలు
  • సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికే అవకాశం
  • లేదంటే ప్రస్తుత పీఆర్వోల్లో ఒకరైన బొల్గం శ్రీనివాస్ కు బాధ్యతలు?

అయోధ్యరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా నియమితులవడంతో, ఆయన ఖాళీ చేసిన ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి పోస్టులోకి కొత్తగా ఎవరు వస్తారన్న విషయం మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఈ సీపీఆర్ఓ పదవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకోవడానికి సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా, తాజాగా రాష్ట్రంలోని ప్రధాన తెలుగు పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతితో పాటు హిందూ వంటి ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో సీనియర్ స్థాయిల్లో పనిచేస్తున్న కొందరు కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుండటంతో, ఈ పదవి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి మనసులో ఎవరున్నారనేది ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పలు వర్గాల నుంచి తీవ్ర పోటీ!
సీపీఆర్ఓ పోస్టు అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రి నిర్వహించే అన్ని రకాల సమావేశాలకు సీపీఆర్ఓ హాజరై మీడియాకు సమాచారం పంపిస్తుంటారు. అందువల్ల నిరంతరం సీఎంను అంటిపెట్టుకొని ఉంటారు. అందువల్ల ఈ పోస్టు మంత్రి, ఐఏఎస్ లతో సమానంగా అత్యంత కీలకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్లకంటే ఎక్కువగా ప్రభావితం చేయగలరు. అందువల్ల ఈ పోస్ట్ పై అనేకమంది సీనియర్ జర్నలిస్టులు కన్నేశారు. అంతర్గతంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హైదరాబాద్‌లో పనిచేసే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ జర్నలిస్టు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాష్ట్రంలోని అగ్రశ్రేణి తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లోనూ… అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సీనియర్లు కూడా చేరడంతో పోటీ మరింత తీవ్రమైంది.

ప్రస్తుత బృందంతోనే కొనసాగింపా?
ఇలా ఉండగా సీపీఆర్ఓ పదవిని ప్రస్తుతానికి భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందితోనే ప్రజా సంబంధాల బాధ్యతలు కొనసాగిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం పీఆర్వోలుగా ఉన్న బొల్గం శ్రీనివాస్, విజయ్ కుమార్ వంటివాళ్లు ప్రముఖ పత్రికల్లో పనిచేసిన వారే. వీరిద్దరూ ఈనాడు నుంచి తమ జర్నలిస్ట్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‌వారంతా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

వివిధ అంశాలపై లోతైన అవగాహన ఉన్న జర్నలిస్టులు కావడంతో ప్రభుత్వానికి, మీడియాకు మధ్య సమన్వయం చక్కగా కుదురుతోందని సీఎం భావిస్తున్నారు. మీడియా కోఆర్డినేషన్, ముఖ్యమైన విషయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయడంలో వారు చురుగ్గా ఉండటంతో, తక్షణమే కొత్తవారిని తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం పీఆర్వోగా ఉన్న బొల్గం శ్రీనివాసుకే బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యం లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *