- అక్రమాలు చేశాడని నిర్ధారించినా అందలమే
- నర్సరీల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ
- రూ. 40 లక్షల రికవరికి అప్పట్లో నిర్ణయం
- అయినా నెత్తిన పెట్టుకుంటున్న అధికారులు
- ఆయిల్ పామ్ గ్రోవర్స్ సమాఖ్య నిలదీత
- ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- నష్టపోయిన రైతుల పరిహారానికి వినతి
సహనం వందే, హైదరాబాద్:
ఆయన ఆయిల్ ఫెడ్ నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అప్పటి ఎండి నిర్మల దీనిపై విచారణ చేసి తప్పు జరిగినట్టు నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు నర్సరీలో జరిగిన అక్రమాలకు అతన్ని బాధ్యున్ని చేసి రూ. 40 లక్షలు రికవరీ చేయాలని ఆమె నిర్ణయించారు. కానీ ఆమె అనంతరం వచ్చినవారు ఎవరూ కూడా అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోకపోగా అందలం ఎక్కించారు. ఇప్పుడు హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ సంస్థలో కీలకంగా ఉన్నాడు. అక్రమాలకు పాల్పడడంలో ఆయన అత్యంత ప్రావీణ్యుడని పేరు గడించాడు. కొందరు ఇతర అధికారులకు, పెద్దలకు ఆయన అక్రమాల ప్రావీణ్యత నచ్చి తమ వెంట తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అక్రమార్కుడి వల్ల రైతులకు అన్యాయం...

దీనిపై అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ సమాఖ్య తీవ్ర ఆరోపణలు చేసింది. నర్సరీలో అవకతవకలపై ఒక ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ 40 లక్షల రికవరీకి ఆదేశించినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఆదే ఉద్యోగిని ఆయిల్ ఫెడ్ లో కీలక పోస్టులో కొనసాగించడంలో ఆంతర్యం ఏంటని సమాఖ్య ప్రశ్నించింది.
అదే అధికారి ఆ సమయంలో సుమారు 83 లక్షల సీడ్ ను విదేశాలనుండి దిగుమతి చేయటంలో కీలక పాత్ర పోషించటం వల్లే ఆయిల్ ఫెడ్ ఈ దుస్థితికి కారణమని, దీంతో రైతులకు నష్టం కలిగిందని సమాఖ్య ఆరోపించింది.ఆయిల్ ఫెడ్ విదేశీ సీడ్ దిగుమతిలో కొంతమంది మధ్యవర్తులు కీలక పాత్ర పోషించి థర్డ్ క్వాలిటీ సీడ్ ను ఇంపోర్ట్ చేయటం మీద కూడా విచారణ జరిపి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సమాఖ్య డిమాండ్ చేసింది. ఆయిల్ఫెడ్లో ప్రైవేటు శక్తులు, కొందరు అధికారుల కుట్రలతో సంస్థ నిర్వీర్యమవుతోందని, ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయిల్ పామ్ రైతుల శ్రేయస్సును పరిరక్షించాలని డిమాండ్ చేసింది.
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏదీ?
కర్లింగ్ మొక్కల వల్ల నష్టపోయిన రైతులకు ఆయిల్ఫెడ్ నష్టపరిహారం ఇవ్వాలని సమాఖ్య డిమాండ్ చేసింది. స్వయంగా తోటలను పరిశీలించి నష్టాన్ని అంగీకరించిన ఆయిల్ఫెడ్ చైర్మన్.. నష్టపరిహారం చెల్లించడానికి చట్టాల్లో అవకాశం లేదని చెప్పడం బాధిత రైతులకు షాక్ ఇచ్చిందని పేర్కొంది. ఈ విషయాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని కోరింది.
30 నెలల వయస్సున్న మొక్కలా?
కర్లింగ్ మొక్కలు ఉన్న రైతులను వాటిని తీసివేసి కొత్త మొక్కలు వేసుకోమని ఆయిల్ఫెడ్ చెబుతోందని సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. 5 నుంచి 8 సంవత్సరాల వయస్సున్న తోటల్లో కొన్ని మొక్కలు తీసి కొత్తవి వేస్తే అవి నీడలో పెరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. 30 నెలల వయస్సున్న మొక్కలు నాటడానికి పనికిరావని తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్లీ కర్లింగ్ మొక్కలు వస్తే నష్టపరిహారం ఇవ్వబోమని చైర్మన్ చెప్పడం దారుణమని మండిపడింది. ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకునే వరకు రైతులు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది.
మంత్రి హామీ ఏమైంది?
ఆల్ టైప్ మొక్కలు వస్తే కంపెనీల నుండి పూర్తి నష్టపరిహారం ఇప్పిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని సమాఖ్య గుర్తు చేసింది. అయితే ఆయిల్ఫెడ్ ఎండీ, చైర్మన్ మాత్రం చట్టాల్లో అటువంటి అవకాశం లేదని చెబుతున్నారని విమర్శించింది. మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ తీసుకొని ఆయిల్ పామ్ చట్టంలో మార్పులు చేసి నష్టపరిహారం ఇప్పించేలా చూడాలని సమాఖ్య తరపున బాధిత రైతులు పుచ్చకాయల సోమిరెడ్డి, చక్రధర్ రెడ్డి, చెలికాని సూర్యారావు కోరుతున్నారు.
కాంట్రాక్టర్లదే బాధ్యత: మహేశ్వర్ రెడ్డి, అధ్యక్షులు, అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోవర్స్ సమాఖ్య

ఆయిల్ ఫెడ్ నర్సరీస్ లోని కాంట్రాక్టర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కర్లింగ్ మొక్కలు రైతుల తోటలోకి రావటానికి కారణమైన 2015-22 సంవత్సరాల మధ్య పనిచేసిన కాంట్రాక్టర్, అధికారులపైన విచారణ చేసి బాధ్యులను ఆయిల్ ఫెడ్ నుండి తొలగించి… నష్టాన్ని వారి నుండి రికవరీ చేయాలి. ఇకపై అన్ని నర్సరీల్లో కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించి గతంలో లాగానే ఆయిల్ ఫెడ్ స్వయంగా నర్సరీ పెంచాలి.
గతంలో కూడా నర్సరీల నుండి మొక్కలను అమ్ముతుండగా పట్టుకుని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో, జనగాం నుండి మొక్కలు అమ్ముకుంటుంటే దానిని పట్టుకుని సత్తుపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా దానిపై చర్యలు తీసుకోకపోవటం శోచనీయం.