- డ్రగ్ కు బానిస అయిన ఒమేగా ఆస్పత్రి మాజీ సీఈవో నమ్రతా
- వాట్సాప్లో రూ. 5 లక్షల డ్రగ్స్ ఆర్డర్… మాజీ సీఈవో నిర్వాకం
- రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నమ్రతా చిగురుపాటి… డ్రగ్ డీలర్ అరెస్ట్
- మత్తు కోసం ఏడాదిలోనే రూ. 70 లక్షలు ఖర్చు…
- హై-ప్రొఫైల్ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయ్యేనా?
సహనం వందే, హైదరాబాద్:
ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నమ్రతా చిగురుపాటి (34) ఏకంగా వాట్సాప్ ద్వారా రూ. 5 లక్షల విలువైన కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనతో ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ ఎంతలా పాతుకుపోయిందో మరోసారి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన డ్రగ్ సరఫరాదారుడు వంశ్ ధక్కర్కు సహకరిస్తున్న బాలకృష్ణ (రాంప్యార్ రామ్) అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నమ్రతా చిగురుపాటి మే 4వ తేదీన నేరుగా వాట్సాప్ ద్వారా డ్రగ్ డీలర్ వంశ్ ధక్కర్ను సంప్రదించారు. ఏకంగా 53 గ్రాముల కొకైన్ కోసం ఆమె ఆన్లైన్లో రూ. 5 లక్షలు చెల్లించారు. ముంబై నుంచి ఈ మత్తు పదార్థాన్ని తీసుకొచ్చిన బాలకృష్ణ, మే 8వ తేదీ సాయంత్రం రాయదుర్గంలోని ఒక రెస్టారెంట్ సమీపంలో నమ్రతాకు డెలివరీ చేస్తుండగా రాయదుర్గం పోలీసులు వారిద్దరినీ చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి 53 గ్రాముల కొకైన్, రూ. 10,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ. 70 లక్షలు తగలేసిన మాజీ సీఈవో…
విచారణలో నమ్రతా చిగురుపాటి గత ఏడాది కాలంగా కొకైన్ బానిసగా మారినట్లు తేలింది. 2021-2022లో స్పెయిన్లో ఎంబీఏ చదువుతున్న సమయంలో ఆమెకు ఈ దురలవాటు అంటుకుందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇండియాకు తిరిగి వచ్చాక ఒక స్థానిక డీజే ద్వారా వంశ్ ధక్కర్తో పరిచయం ఏర్పడి, అప్పటినుంచి నెలనెలా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ వచ్చిందని తెలిసింది. గత ఒక్క సంవత్సరంలోనే ఆమె డ్రగ్స్ కోసం దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన సూత్రధారి కోసం వేట…
నమ్రతా చిగురుపాటి, బాలకృష్ణలపై నార్కోటిక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ డ్రగ్ రాకెట్లోని ప్రధాన సూత్రధారి వంశ్ ధక్కర్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది పెద్దల హస్తం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ మహమ్మారి?
ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కొందరు నమ్రతా అరెస్ట్ను సమర్థిస్తూ చట్టం అందరికీ ఒకటేనని అంటున్నారు. మరికొందరు మాత్రం ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ వ్యసనం ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్నది మాత్రమేనని, ఇంకా ఎందరో ఇలాంటి మత్తులో కూరుకుపోయి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.