- పెరిగిన టారిఫ్లతో ధరల మంట, కొరత
- చైనా ఉత్పత్తులు లేని జీవితాన్ని ఊహించలేం
- అమెరికన్ పౌరుల మనోగతం…
సహనం వందే, అమెరికా:
అమెరికన్ల ఇళ్లల్లో చైనా ఉత్పత్తులు లేని జీవితాన్ని ఊహించలేం. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బొమ్మలు, ఫర్నిచర్ వంటి నిత్యవసరాల్లో చైనా వాటా అత్యధికం. అయితే కొత్త టారిఫ్ల కారణంగా వీటి ధరలు భారీగా పెరగడమే కాకుండా, కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అక్కడి మీడియా హెచ్చరించింది. ఈ మార్పులు అమెరికన్ ఇళ్లపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
చైనాపై తిరుగులేని ఆధారం…
బొమ్మల్లో 97%, బూట్లలో 92%, ఎలక్ట్రానిక్స్లో 80% దిగుమతులు చైనా నుంచే వస్తున్నాయి. గృహోపకరణాలు, క్రీడా సామాగ్రి, క్రిస్మస్ అలంకరణలు, గొడుగులు వంటి వాటిలోనూ చైనా ఆధిపత్యం స్పష్టం. తక్కువ ధరలు, విస్తృత లభ్యతతో అమెరికన్లు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
టారిఫ్ల దెబ్బ... ధరల మంట
2025లో విధించిన కొత్త టారిఫ్లతో చైనా వస్తువులపై 10-25% అదనపు పన్ను పడుతుంది. దీంతో బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటి ధరలు గణనీయంగా పెరుగుతాయి. దిగుమతులు తగ్గితే డిమాండ్ను అందుకోవడం ఇతర దేశాలకు కష్టమవుతుంది. వియత్నాం, భారత్ వంటి దేశాలు చైనా ఉత్పత్తి సామర్థ్యం, ధరలకు సరితూగలేవని అక్కడి మీడియా ప్రస్తావించింది.
నిత్యం వాడే వస్తువుల ధరలు పెరుగుదల…
బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాల ధరలు టారిఫ్ల వల్ల ఎక్కువగా పెరుగుతాయి. ఇవి అమెరికన్ ఇళ్లల్లో నిత్యం వాడే వస్తువులు కావడంతో సామాన్యుల జీవన వ్యయం పెరుగుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచినా, చైనా ఉత్పత్తి సామర్థ్యం, తక్కువ ధరలను అందుకోవడం కష్టం. దేశీయ ఉత్పత్తి పెంచడం ఖరీదైనది, ఎక్కువ సమయం తీసుకుంటుంది.
వినియోగదారులపై తీవ్ర ప్రభావం…
మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు ధరల పెరుగుదల వల్ల ఎక్కువగా నష్టపోతారు. పాఠశాల సామాగ్రి, దుస్తులు, బొమ్మల ధరలు పెరిగితే కుటుంబ బడ్జెట్పై ఒత్తిడి పడుతుంది. పెద్ద రిటైలర్ల లాభాలు తగ్గుతాయి. చిన్న వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉంది. సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. కొత్త సరఫరాదారులను వెతకడం ఖర్చుతో కూడుకున్నది. టారిఫ్లు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించినా, ధరల పెరుగుదల, కొరతలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. చైనాతో వాణిజ్య యుద్ధం ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక విశ్లేషించింది.