- ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోస్తున్న అగ్రవర్ణాలు
- అగ్రవర్ణ పార్టీ నాయకులకు ఎందుకింత ప్రేమ?
- కులగణన కోసం కాంగ్రెస్, బీజేపీ ఆరాటం
- కుల అఘాయిత్యాలు చేస్తూ భజనెందుకు?
- అగ్రవర్ణాలకు రాజకీయ అధికారం కావాలి…
- అందుకు బహుజనుల ఓట్లు కావాలి అంతే…
- అందుకే బహుజనులను మభ్యపెడుతున్నారు
- కులగణన అంటూ బహుజనులపై మహా భక్తి
- వారిని రిజర్వేషన్లకే పరిమితం చేసే కుట్ర
- ‘బహుజన జాతి’ ఐక్యతతోనే కుట్రలకు చెక్
సహనం వందే, హైదరాబాద్:
- ఒకవైపు లగచర్లలో బడుగు బలహీన వర్గ రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు హడావుడిని చూశాం. అడ్డొచ్చిన రైతులను లాఠీలతో కొట్టి కేసులు పెట్టి జైలు పాలు చేశారు.
- ఇంకోవైపు హైదరాబాదులో హైడ్రా పేరుతో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేదల గుడిసెలను, ఇళ్లను కూల్చేశారు.
- జర్నలిస్టుల్లో 80 శాతం మందికి పైగా బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు. కానీ ఆ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
- అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు, ఉన్నత ఉద్యోగాల్లో అగ్రవర్ణాలకు చెందిన వారినే నియమిస్తున్నారు. ఎక్కడ చూసినా రెడ్డి వర్గమే రాజ్యమేలుతుంది.
ఇలా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ… మరోవైపు తాము బహుజనుల కోసమే పుట్టామని… వారి సేవలోనే తరిస్తామని… అందుకే కులగణన చేశామని అధికార పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారు. వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో పై ఉదాహరణలు చాలు. దేశంలో… రాష్ట్రంలో బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల తీరు ఇదే. బీజేపీ మతంపై ఆధారపడి ఓట్లు సంపాదిస్తున్నందున… కులంపై ఆధారపడి ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు బీజేపీ మతం, కులం రెండింటిలో జొరబడి ఓటు బ్యాంకుపై కన్నేసింది. ఇలా అన్ని అగ్రవర్ణ పార్టీలు బహుజన భజన అందుకున్నాయి. అగ్రవర్ణ పార్టీలు బహుజనుల కోసం ఏదో చేస్తామంటే నమ్మడం పిచ్చి పని. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో గుర్తించినంత కాలం ఆ ప్రజలు మోసపోతూనే ఉంటార’ని అన్నాడు. ఈ ప్రకారం రాజకీయాలను విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లకే పరిమితం చేస్తారా?
బహుజనులను రిజర్వేషన్ల చట్రంలో బంధించి రాజకీయ అధికారం నుండి వారిని దూరం చేసే కుట్ర జరుగుతోంది. అంబేద్కర్, కాన్షీరాం లాంటి బహుజన ఉద్యమకారులు రాజకీయ అధికారమే విముక్తికి మార్గమని చెప్పారు. కానీ అగ్రవర్ణాలు బహుజనులను మభ్యపెట్టి, వారి ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. కులగణన బహుజనులకు న్యాయం చేస్తుందని అగ్రవర్ణ పార్టీలు డప్పు కొడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు తెలిస్తే వారికి సమానత్వం దక్కుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ లెక్కలు సేకరించిన తర్వాత తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య. జనాభా డేటా తెలిసినా… రాజకీయ అధికారం, ఆర్థిక వనరులు, సామాజిక సమానత్వంలో బహుజనులకు న్యాయమైన వాటా ఇవ్వకపోతే కులగణన కేవలం రాజకీయ నాటకంగా మిగిలిపోతుంది.
తెలంగాణ కుల సర్వేపై విమర్శలు…
తెలంగాణలో కులగణన సర్వే చేశారు. 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన ఈ సర్వేలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. బీసీ సంఘాలు ఈ సర్వేను తప్పుల తడకగా ఖండించాయి. బీసీల సంఖ్యను తక్కువగా చూపించడం ద్వారా, వారికి రాజకీయ, ఆర్థిక వాటాను కుదించే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇది కులగణన పేరుతో బహుజనులను మోసం చేసే అగ్రవర్ణ ఎత్తుగడలను బయటపెడుతుంది.
ఇన్నాళ్లు బీసీలకు 27 శాతమే రిజర్వేషన్లా?
భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధన బహుజనులకు శాపంగా మారింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జనాభా ఎంత ఎక్కువగా ఉన్నా, ఈ పరిమితి కారణంగా వారికి ఆ స్థాయిలో రిజర్వేషన్లు దక్కవు. ఉదాహరణకు బీసీలు దేశ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, వారికి కేవలం 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. ఈ నిబంధనను తొలగించకుండా కులగణన న్యాయం చేస్తుందని చెప్పడం బహుజనులను మోసం చేయడమే. అంబేద్కర్ రిజర్వేషన్లను సామాజిక సమానత్వం కోసం సాధనంగా పరిచయం చేశారు. కానీ ఆయనే ఆవేదనతో, ‘రిజర్వేషన్ల వల్ల కొందరు గుమస్తాలు తయారయ్యారు. కానీ గ్రామాల్లో బహుజనులు భూమి లేక భూస్వాములకు దాస్యం చేస్తున్నార’న్నారు. రిజర్వేషన్లను బహుజనుల శాశ్వత పరిష్కారంగా చూపడం, వారిని అధికార రాజకీయాల నుండి దూరం చేసే అగ్రవర్ణ కుట్రలో భాగమే.
బీహార్ లో ఏమైంది?
కాంగ్రెస్, బీజేపీలు కులగణన కోసం ఆరాటం చేస్తున్నాయి. కానీ వాటి ఉద్దేశాలు మాత్రం అంతర్గతంగా ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు తెలిసిన తర్వాత, వారికి న్యాయమైన వాటా ఇవ్వాలనే ఒత్తిడి పెరుగుతుందని ఆయా పార్టీలకు తెలుసు. అందుకే కులగణనను ఆలస్యం చేయడం, తప్పుడు లెక్కలతో నివేదికలు సిద్ధం చేయడం వంటి కుటిల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి.
ఉదాహరణకు బీహార్లో 2023లో జరిగిన కుల సర్వే బీసీలు, ఈబీసీలు కలిపి అక్కడి జనాభాలో 63% ఉన్నారని వెల్లడించింది. కానీ ఈ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలన్న నిర్ణయాన్ని కోర్టులు 50% పరిమితి కారణంగా రద్దు చేశాయి. అంటే అగ్రవర్ణ పార్టీలు బహుజనులకు న్యాయం చేసే ఉద్దేశం లేదని ఈ సంఘటన చెబుతుంది.
వోటు హమారా…రాజ్ తుమ్హారా
‘రాజకీయ అధికారం లేని బహుజన సమాజం సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించలేద’ని అంబేద్కర్ అన్నారు. కాన్షీరాం ‘వోటు హమారా… రాజ్ తుమ్హారా… నహీ చలేగా’ అనే నినాదంతో బహుజనులను చైతన్యం చేశారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) స్థాపన ద్వారా బహుజనులకు రాజకీయ అధికారం సాధించే మార్గాన్ని చూపించారు. కానీ అగ్రవర్ణ పార్టీలు బహుజన నాయకులను చిన్న పదవులతో కొనుగోలు చేసి, వారిని చెంచాలుగా మార్చి ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నాయి.
బహుజనులు దృష్టి పెట్టాల్సింది…
స్వతంత్ర రాజకీయ శక్తి: బహుజనులు కాంగ్రెస్, బీజేపీలకు ఓటు బ్యాంకులుగా మారకుండా రాజకీయ శక్తిగా ఎదగాలి.
కులగణనపై నిఘా: కులగణన సర్వేలు పారదర్శకంగా, శాస్త్రీయంగా జరిగేలా బహుజన సంఘాలు ఒత్తిడి తేవాలి. తప్పుడు డేటా సేకరణను అడ్డుకోవాలి.
ఆర్థిక, సామాజిక వాటాకు డిమాండ్: జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, వ్యాపార, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను డిమాండ్ చేయాలి.
చెంచా నాయకుల బహిష్కరణ: అగ్రవర్ణ పార్టీలకు విధేయులైన బహుజన నాయకులను బహిష్కరించి, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.