- కాంగ్రెస్ నినాదం… కాషాయం హైజాక్
- మొదట్లో కులగణన వద్దని చెప్పిన కమలం…
- చివరకు రాజకీయ అవసరాలతో ఆమోదం
- కాంగ్రెస్ నినాదంతోనే హస్తం పార్టీకి బిగ్ షాక్
- దీంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు
- తెలంగాణ కులగణనకు సాధికారత లేనట్టే
- కేంద్ర కులగణనతో రాష్ట్ర సర్వే అటకెక్కినట్లే
- బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు బ్రేక్
సహనం వందే, హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు వ్యతిరేకంగా వ్యవహరించింది. దేశాన్ని కులాలవారీగా చీల్చవద్దంటూ హితవు పలికింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కుల సర్వే చేసి వాటి వివరాలు వెల్లడించాయి. అంతేగాక తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో ఛాంపియన్ గా నిలిచింది. దీంతో బడుగు బలహీన వర్గాల్లో హస్తం పార్టీకి సానుభూతి పెరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ నినాదం… కాషాయం హైజాక్
దేశవ్యాప్త డిమాండ్ల నేపథ్యంలో కమలం పార్టీ ఆలోచనలో పడిపోయింది. మొదటినుంచీ ఈ విషయంలో వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు అకస్మాత్తుగా కులగణన చేసి తీరుతామని స్పష్టం చేసింది. ఒకరకంగా కాంగ్రెస్ నినాదాన్ని కాషాయ పార్టీ హైజాక్ చేసింది. బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉన్నందున… ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కులగణన నినాదాన్ని హైజాక్ చేయాలని నిర్ణయం తీసుకున్న కాషాయపు పార్టీ, తగు సమయం చూసి అందుకు ఆమోదం తెలపడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో దెబ్బపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ నినాదమే కాషాయానికి ఇప్పుడు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు మతం… మరోవైపు కులాలను తన వైపు తిప్పుకోవడం ద్వారా మరింత లబ్ధి పొందాలని కాషాయపు పార్టీ పెద్ద స్కెచ్చే వేసింది.
తెలంగాణ కులగణనకు సాధికారత లేనట్టే…
కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన కులగణన ప్రక్రియకు బ్రేక్ పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే గణనకే ప్రామాణికత ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ప్రశ్నార్థకంలో పడింది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కీలక ప్రకటన చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు విడివిడిగా కుల సర్వేలు చేపట్టినప్పటికీ, జాతీయ స్థాయిలో జరిగే సమగ్ర గణనకే చట్టబద్ధత ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో వేర్వేరుగా చేసే సర్వేల వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసమే కుల సర్వేలు చేపట్టాయని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన సర్వేలు పారదర్శకంగా లేవని ఆయన ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్ల సమాజంలో అనవసరమైన అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే జాతీయ స్థాయిలో అధికారికంగా జనాభా లెక్కల్లోనే కులగణన చేపట్టాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే సందిగ్ధల్లో పడింది. రాష్ట్ర సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కూడా మూలన పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. అనేకమంది సర్వేలో పాల్గొనలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండోసారి కూడా కొందరికి అవకాశం కల్పించారు. ఏది ఏమైనా ఈ సర్వే మీద అనేకమంది కుల సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాము చేపట్టిన సర్వే చట్ట ప్రకారమే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ నిర్ణయం దేశంలో అమలు: రేవంత్
కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, భారత్ జోడో యాత్రలో చెప్పిన విధంగా కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామని, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ ఆలోచన అమలులోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. కేంద్ర కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.