- రూ. 2 వేల భృతిపై ఎన్ఎంసీకి ఫిర్యాదు!
- నామమాత్రపు స్టైపెండ్తో విద్యార్థుల కష్టాలు
- కాలేజీ నిర్లక్ష్యంపై ఆగ్రహం
సహనం వందే, హైదరాబాద్:
మొయినాబాద్లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇంటర్న్లు, రెసిడెంట్ డాక్టర్లకు సరైన స్టైపెండ్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఇదివరకే వెలుగులోకి వచ్చాయి. కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి స్టైపెండ్ డబ్బులు తీసుకుని, తిరిగి వారికి జమ చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది భాస్కర మెడికల్ కాలేజీకి చెందిన ఒక వైద్యుడు ఈ విషయంపై ఎన్ఎంసీతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కళాశాల విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని, బ్లాంక్ చెక్కులు తీసుకుని డబ్బులు జమ చేసి మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కొత్త జీవోను ఖాతరు చేయని కళాశాల…
తాజాగా ఈ విషయంపై ఒక న్యాయవాది పవితారెడ్డి ఎన్ఎంసీ యూజీ బోర్డుకు ఫిర్యాదు చేస్తూ, కళాశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇంటర్న్లకు స్టైపెండ్ చెల్లించాలని కోరారు. భాస్కర మెడికల్ కాలేజీ 2003 నాటి జీవోను చూపిస్తూ తక్కువ స్టైపెండ్ ఇస్తోందని, ఆ జీవో కళాశాల స్థాపనకు ముందే వచ్చిందని, అది ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2023 నాటి జీవో ప్రకారం ఎంబీబీఎస్ ఇంటర్న్లకు నెలకు రూ. 25,906 స్టైపెండ్ చెల్లించాలని స్పష్టంగా ఉంది. కానీ భాస్కర మెడికల్ కాలేజీ ఈ నిబంధనను బేఖాతరు చేస్తోందని న్యాయవాది ఆరోపించారు. ఇది విద్యార్థులకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుగా జీవో ఉటంకించడం విడ్డూరం!
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఎంసీ అధికారి కూడా పొరపాటుగా పాత జీవోనే ఉటంకించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక తప్పిదమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ఎంసీ, డీఎంఈ కళాశాల నుంచి సరైన సమాచారం తీసుకోకుండా ఇలాంటి తప్పుడు సమాధానాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని న్యాయవాది పవితారెడ్డి ప్రశ్నించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇంత తక్కువ స్టైపెండ్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ పని చేయించుకుంటూ కనీస వేతనం కంటే తక్కువ ఇవ్వడం అమానుషమని అన్నారు. భాస్కర మెడికల్ కాలేజీ స్టైపెండ్ పేరుతో విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తోందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది దోపిడీ అని, కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయవాది డిమాండ్ చేశారు. జనవరి 2025 నుంచి పూర్తి స్టైపెండ్ చెల్లించాలని, స్టైపెండ్ చెల్లింపుల రికార్డులు సమర్పించాలని, పాత జీవోను తప్పుగా చూపినందుకు కళాశాల వివరణ ఇవ్వాలని పవితారెడ్డి కోరారు. అలాగే, కళాశాల వెబ్సైట్లో స్టైపెండ్ వివరాలు బహిర్గతం చేయాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించే వరకు 2025-26 ప్రవేశాలు నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.15 రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాది హెచ్చరించారు. డీఎంఈ కూడా ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పేద విద్యార్థుల పట్ల మానవతా దృక్పథంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఒక కళాశాల సమస్య కాదని, వ్యవస్థాగతమైన బాధ్యత అని పవితారెడ్డి స్పష్టం చేశారు