- ఆలిండియా టాపర్గా నిలిచిన శక్తి దూబే
- తెలుగు రాష్ట్రాల టాపర్గా సాయి శివాణి
- సివిల్స్–2024 ఫలితాలు విడుదల
సహనం వందే, హైదరాబాద్
సివిల్ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్ పరాగ్ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసింది. మరో 230 మందిని రిజర్వ్ జాబితాలోకి చేర్చింది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేటగిరీలతో పాటు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బి కేటగిరీల్లో ఈ అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్లో మెరుగైన ఫలితాలు సొంతం చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు…
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తం 1009 మందిని ఎంపిక చేయగా… అందులో దాదాపు యాభైకి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన ఎట్టబోయిన సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా బన్న వెంకటేష్ 15వ ర్యాంక్, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంక్, చింతకింది శ్రవణ్కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు సాధించారు. ఎన్.చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి119వ ర్యాంకు, నేలటూరు శ్రీకాంత్ రెడ్డి 151వ ర్యాంకు సాధించారు. నెల్లూరు సాయితేజ 154వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణ సాయి 190వ ర్యాంకుల సొంతం చేసుకున్నారు

ఇక తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా మహిళ సత్తా చాటారు. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన ఎట్టబోయిన సాయి శివాణి ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు సాధించగా… తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. సివిల్స్–2024 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన మంగళవారం విడుదల చేసింది.