స్మిత వర్సెస్ సీఎం

రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు చేస్తూ తగ్గేదేలే అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు ఆమె అంత ధైర్యంగా నిలబడటానికి కారణం ఏంటన్న చర్చ జరుగుతుంది. ఆమె వెనుక గత ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనా ఉన్నారా అన్న చర్చ జోరుగా సాగుతుంది.

‘ఒక స్త్రీ తనకోసం నిలబడే ప్రతిసారీ, ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది…’ అంటూ ఓ మహిళా నెటిజన్ చేసిన ట్వీట్‌ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. గతంలోనూ ఆమె చేసిన కొన్ని కామెంట్లు, పోస్టులు పెద్ద దుమారమే రేపినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ అదే తెగువను ప్రదర్శిస్తున్నారు.

కంచె గచ్చిబౌలి వివాదంలో వంద ఎకరాల భూమిని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఫోటోను రీట్వీట్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని పరోక్షంగా విమర్శించారు. ‘తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన ట్వీట్‌ను కూడా ఆమె రీపోస్ట్ చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వంతో బహిరంగంగా విభేదించడం, పోలీసుల నోటీసులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయో వేచి చూడాల్సి ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *