- కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం
- సీఎం సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ లేఖ
- విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికే
సహనం వందే, బెంగళూరు:
విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ, విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుల వివక్ష వల్లనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత విద్యాసంస్థల్లో వివక్షను నిరోధించే చట్టం కోసం చర్చలు జరిగాయి.
రాహుల్ లేఖలో కీలక అంశాలు…
కర్ణాటక ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. రోహిత్ వేముల చట్టం విద్యాసంస్థల్లో కులం, తరగతి, మతం ఆధారంగా వివక్షను నిరోధిస్తుందని అన్నారు. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని, మానసిక ఆరోగ్యం, సామాజిక సమానత్వం కాపాడాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాహుల్ గాంధీ లేఖపై సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు. సామాజిక న్యాయం పట్ల రాహుల్ నిబద్ధతకు ధన్యవాదాలు తెలిపారు. రోహిత్ వేముల చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఏ విద్యార్థి కూడా వివక్షకు గురికాకూడదని, ఈ చట్టం సామాజిక సమానత్వానికి మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.