ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది.

క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు రూ. 60 లక్షల నగదు ఇచ్చారు. అయితే, మహబూబ్‌నగర్‌లోని ఇల్లు మాత్రం తన ఇద్దరు కుమార్తెల పేరు మీద రిజిస్టర్ చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్యరావు మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటున్న తమ అన్నయ్య గిరీష్‌కు తెలియజేశారు. అయితే ఆస్తి తనకు ఇవ్వలేదన్న కోపంతో గిరీష్ తండ్రి అంత్యక్రియలకు రానని తేల్చి చెప్పాడు.

తండ్రికి తలకొరివి పెట్టేందుకు కుమారులు లేకపోవడంతో కుమార్తెలే ఆ బాధ్యత తీసుకున్నారు. అన్నయ్య మనసు మారుతుందేమోనని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ముందుకు వచ్చి అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని తెలిపారు. బంధువులు, మిత్రులు కూడా సహకరించడంతో చిన్న కుమార్తె రాజనందిని తండ్రి అంతిమయాత్రకు ముందు నడిచింది.

తండ్రి చివరి చూపునకు కూడా రాకుండా ఆస్తికి ప్రాధాన్యం ఇచ్చిన గిరీష్‌ తీరును గ్రామస్థులు, బంధువులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతుళ్ల ప్రేమ, గ్రామస్థుల సహకారంతో మాణిక్యరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *