ప్యాలెస్ పాలిటిక్స్

రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వేష భాష కూడా అత్యంత సాధారణంగా ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సాధారణ వ్యక్తిగానే కనిపిస్తారు. అనేకమంది మంత్రులు అత్యంత సాదాసీదా డ్రస్సుల్లో కనిపిస్తారు. కానీ వారి ఆస్తిపాస్తులు, వారు నివసిస్తున్న భవంతులు చూస్తే మతి పోవాల్సిందే.

జగన్మోహన్ రెడ్డికి వేలకోట్ల ఆస్తులు, హైదరాబాదులో విలాసవంతమైన భవనం, బెంగళూరులో ప్యాలెస్, తాడేపల్లిలో రెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భవనం ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాదులో విలాసవంతమైన భవనం ఉంది. ఇప్పుడు అమరావతిలో ఐదు ఎకరాల్లో భారీ ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఒకవైపు నిలువ నీడ లేని పేదలు రోజువారి భుక్తి కోసం పోరాడుతుంటే, మరోవైపు నాయకులు ఆడంబర భవనాల నిర్మాణంపై దృష్టి సారించారు. పేదలకు 60 గజాల స్థలం కూడా లేని పరిస్థితుల్లో… నాయకుల ఈ ఆడంబర జీవనంపై ప్రశ్నిస్తే, తాము వ్యాపారాలు చేస్తున్నామని బుకాయిస్తారు. ప్రస్తుత పార్లమెంటులో 475 మంది కోటీశ్వర సభ్యులు రాజకీయాలను సంపద సముపార్జనకు వేదికగా మార్చుకున్నారు. అధికారంలో ఉంటూ వ్యాపారాలను విస్తరించడం, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో నాయకులు సొంత ఆస్తులను అమ్మి దేశం కోసం పోరాడారు. మహిళలు తమ బంగారు గాజులు, ఆభరణాలను గాంధీకి అందించారు. కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావులు తమ యావదాస్తిని ప్రజా సేవకు అర్పించారు. అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కె. అద్వానీ వంటి నాయకులు సాధారణ జీవనంతో సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. ఆనాడు నాయకులు రాజకీయాల్లో చేరి ఆస్తులు కోల్పోయేవారు. కానీ నేటి నాయకులు అధికారాన్ని సంపద సముపార్జనకు మెట్లుగా మార్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాల్లో విహరిస్తూ, ప్యాలెస్‌లలో జీవిస్తూ పేదలకు నీతి వాక్యాలు చెబుతున్నారు. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, నాయకులపై అవిశ్వాసాన్ని రగిలిస్తోంది.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఎంపీ సుధామూర్తి సాధారణ శారీల గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను ఆకర్షిస్తారు. తన అల్లుడు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశానికి వెళ్తే విమానాశ్రయంలో ఆమెను చూసి నమ్మలేకపోయారట. అంత సింప్లిసిటీ వల్ల ఆమె ఏదో సాధించారట. కానీ వందల కోట్ల విలువైన ఇళ్లలో నివసిస్తూ, ఈ సాధారణ జీవితం గురించి ఆమె ఉపన్యాసాలు ఇవ్వడం నాటకమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సామాజిక సేవలో ఆమె పాల్గొన్నప్పటికీ, ఇది కేవలం ప్రజల్లో ఇమేజ్‌ను పెంచుకోవడానికన్న విమర్శలు వస్తున్నాయి.

మహాత్మా గాంధీ సాధారణ జీవనానికి నిలువెత్తు నిదర్శనం. ఖాదీ దుస్తులు, సబర్మతి ఆశ్రమంలో సాధారణ జీవనం ద్వారా ఆయన సత్యం, అహింస, స్వావలంబనను ఆచరించారు. గాంధీ ఉద్దేశం స్వాతంత్ర్యంతో పాటు ప్రజలను సమానత్వం వైపు నడిపించడం. ఆయన ఉప్పు సత్యాగ్రహం, ఖాదీ ఉద్యమం సామాన్యులను ఏకం చేశాయి. ‘అందం ఆడంబరంలో కాదు, నడవడికలో ఉంటుంద’న్న ఆయన మాటలు అవినీతి నేతలకు సవాల్. ఆయన ఆడంబరాన్ని తిరస్కరించి ప్రజల్లో ఒకరిగా జీవించారు. కానీ నేటి నాయకులు గాంధీ సాధారణ జీవితాన్ని మరిచి, ప్యాలెస్‌లలో రాజసంగా బతుకుతున్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సూటు-బూటు ధరించడం కేవలం దుస్తుల ఎంపిక కాదు. కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక విప్లవ సంకేతం. దళిత సమాజానికి చెందిన ఆయన విద్య, ఆధునికతను స్వీకరించి సమానత్వాన్ని చాటారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసంతో అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చారు. గాంధీ అహింస దారిలో నడిచితే, అంబేద్కర్ రాజకీయ, రాజ్యాంగ పోరాటంతో కుల నిర్మూలన కోసం కృషి చేశారు. కానీ నీతి రహితమైన నేటి నాయకులు అంబేద్కర్ ఆదర్శాలను విస్మరించి సంపద సముపార్జనకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

నేటి నాయకులు పేదల సేవ పేరుతో ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని, అధికారం, సంపద సముపార్జనకు పాకులాడుతున్నారు. అధికారంలో ఉంటూ సొంత వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారు. జగన్ వేలకోట్ల ఆస్తులపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం సంపద సముపార్జనలో ముందున్నారు. అధికారంలో ఉంటూ వ్యాపారాలు చేయడం, చట్టాలను తమకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల సొమ్మును ప్రభుత్వ అధిపతులుగా, ప్రజాప్రతినిధులుగా వాటిని సంరక్షించాల్సిన నేతలు వారే దుర్వినియోగం చేస్తున్నారు విమర్శలున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల ఆస్తికి సంరక్షకులుగా ఉండాలి. కానీ దాన్ని భక్షించడమే నాయకుల ప్రధాన లక్ష్యంగా మారింది. అందుకోసమే అధికారం కోసం నానా గడ్డి తింటున్నారు. అధికారంలో ఉంటూ వ్యాపారాలు చేయడం, చట్టాలను తమకు అనుకూలంగా మలచుకోవడం సమంజసం కాదు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *