- నాటి ఐపీఎస్ ఆఫీసర్ నేడు ఎన్ఐఏ చీఫ్
- ఉగ్రవాది తహవూర్ రాణా కేసు విచారణ
సహనం వందే, ఢిల్లీ:
26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. ఈ విచారణకు 26/11 దాడుల్లో పోరాడిన హీరో, ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ నాయకత్వం వహిస్తుండటం విశేషం. అప్పుడు ముంబై దాడుల్లో గాయపడిన ఈ ఐపీఎస్, ఇప్పుడు అదే కేసులో అంతర్జాతీయ ఉగ్రవాదిని విచారణ చేయడం విశేషం. సదానంద్ డేట్ 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి.
ముంబై దాడుల్లో అసమాన ధైర్యం…
26/11 దాడుల సమయంలో సదానంద్ డేట్ ఒక ఐపీఎస్ అధికారిగా ముంబైలో విధులు నిర్వహించారు. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో డేట్ ఒంటరిగా వారిని ఎదుర్కొన్నారు. ప్రముఖ ఉగ్రవాది కసబ్తో సహా ఇతర దుండగులను ఎదిరించి, దాదాపు 40 నిమిషాల పాటు తీవ్రంగా పోరాడారు. ఈ పోరాటంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ, ఆయన సాహసం అనేక మంది పౌరులను కాపాడింది. ఈ అసాధారణ ధైర్యానికిగాను డేట్కు రాష్ట్రపతి శౌర్య పతకం లభించింది. ఆయన సాహసగాథ దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు సదానంద్ డేట్ ఎన్ఐఏ చీఫ్గా తహవూర్ రాణా కేసును నడిపిస్తున్నారు. రాణా 26/11 దాడులకు సంబంధించిన కీలక నిందితుడిగా ఉన్నాడు. భారత్లో మరిన్ని ఉగ్రవాద కార్యకలాపాలను పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తోంది. డేట్ నేతృత్వంలో ఎన్ఐఏ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది.