కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:
కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కుల గణన నివేదికలో ఏం ఉంది?
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ 2015లో ఒక పెద్ద సర్వే నిర్వహించింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరు వెనుకబడి ఉన్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దాదాపు 5.98 కోట్ల మంది వివరాలు సేకరించారు. అంటే రాష్ట్ర జనాభాలో 94 శాతం మందిని లెక్కించారు. మొత్తం 1.38 కోట్ల కుటుంబాల సమాచారం తీసుకున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగానే ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులపై చర్చించేందుకు ఏప్రిల్ 17న ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

రాజకీయం దుమారం…
ఈ నివేదిక బయటకు రాగానే రాష్ట్రంలో రాజకీయ చర్చలు మొదలయ్యాయి. వెనుకబడిన వర్గాల నాయకులు ఇది సామాజిక న్యాయం వైపు ఒక మంచి అడుగు అంటున్నారు. కానీ లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాల నేతలు మాత్రం ఈ సర్వే సరిగా లేదని, మళ్లీ కొత్త సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల కోసం ఆడుతున్న నాటకం అని విమర్శిస్తోంది. కులాల మధ్య గొడవలు పెట్టడానికే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తోంది.

రిజర్వేషన్ పెంపు అంత ఈజీనా?
ఒకవేళ ఓబీసీ రిజర్వేషన్‌ను 51 శాతానికి పెంచితే, రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ 50 శాతం దాటిపోతుంది. ఇలా జరగడం చట్టపరంగా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కూడా 42 శాతం రిజర్వేషన్లు పెంచినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. కర్ణాటక కేబినెట్ ఈ సిఫార్సులను ఎలా తీసుకుంటుంది, వాటిని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సామాజిక న్యాయమా? రాజకీయ ఎత్తుగడనా?
కుల గణన నివేదిక ద్వారా ఓబీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు వస్తే, విద్య, ఉద్యోగాల్లో వారికి సమాన అవకాశాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది అమలైతే రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానం పూర్తిగా మారిపోతుంది. దీనివల్ల సమాజంలో వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందా లేక రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుస్తుందో అనేది వేచి చూడాలి. ఈ నివేదికపై జరిగే తదుపరి పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *