- తమ పౌరులకు యూరోపియన్ దేశాల విజ్ఞప్తి
- రష్యా – ఉక్రెయిన్ వార్ తో భయాందోళనలు
- ఏం చేయాలో ఇంటింటికీ యుద్ధ బుక్లెట్లు
- నిత్యావసరాలు రెడీ చేసుకోవాలని సూచన
- తప్పించుకోవడం, తలదాచుకోవడంపై శిక్షణ
- పొంచి ఉన్న సైబర్, హైబ్రిడ్ దాడుల ప్రమాదం
- గతంలో మాదిరి అమెరికా అండ డౌటే
- ఫిన్లాండ్ లో బాంబ్ షెల్టర్ల నిర్మాణం
సహనం వందే, యూరప్:
రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం తలుపు తడుతోందనే భయంతో ప్రజలను రక్షించడానికి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశాయి. నిత్యావసర వస్తువుల నిల్వలు పెంచుకోవడం, సామూహికంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం వంటి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడటం లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారం, నీరు, మందులు వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రమాద సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇప్పుడే ఎందుకీ యుద్ద భయాలు?
యూరప్ లో యుద్ధ భయాలు నెలకొనడానికి ప్రస్తుత పరిస్థితులు కారణంగా కనిపిస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్లో రష్యా తన లక్ష్యాలను సాధిస్తే, పొరుగు దేశాలకు కూడా ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన చెందుతున్నారు. రష్యాతో సరిహద్దులు కలిగిన ఫిన్లాండ్ వంటి దేశాలు రష్యా సైనిక శక్తిని చూసి ఎప్పటినుంచో కలవరపడుతున్నాయి. గతంలో యూరప్కు అండగా నిలిచిన అమెరికా, ఈ మధ్యకాలంలో తన వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ నాటో సభ్య దేశంపై దాడి జరిగితే, అమెరికా ఎంతవరకు సాయం చేస్తుందనే సందేహాలు యూరప్లో నెలకొన్నాయి. దీంతో యూరోపియన్ దేశాలు తమ సొంత రక్షణ ఏర్పాట్లపై దృష్టి సారించాయి.
సైబర్ దాడులు, సమాచార యుద్ధం…
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు, సమాచార యుద్ధం వంటి హైబ్రిడ్ యుద్ధ ముప్పు పెరుగుతోంది. రష్యా నుండి ఇటువంటి బెదిరింపులు ఎక్కువగా ఉండటంతో విద్యుత్, నీరు, టెలికమ్యూనికేషన్ వంటి కీలక సేవలకు అంతరాయం కలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు కనీసం మూడు రోజుల వరకు తమ అవసరాలు తీర్చుకునేలా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇటీవల పౌరులు కనీసం 72 గంటలకు సరిపడా ఆహారం, నీరు, ఇతర ముఖ్యమైన సరుకులను నిల్వ చేసుకోవాలని సూచించింది. కేవలం యుద్ధమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు వంటి ఇతర సంక్షోభ సమయాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది.
ఒకవేళ యుద్ధం వస్తే…?
జర్మనీ అయితే యుద్ధ సమయంలో ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పులను ఊహిస్తూ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. స్వీడన్ ప్రభుత్వం “ఒకవేళ సంక్షోభం లేదా యుద్ధం వస్తే” అనే పేరుతో ఒక ప్రత్యేక గైడ్ను లక్షలాది ఇళ్లకు పంపిణీ చేసింది. ఇందులో తప్పించుకోవడం, యుద్ధాన్ని ఎదుర్కోవడం, పిల్లలతో సంక్షోభం గురించి మాట్లాడటం వంటి ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. రష్యాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 1950ల నుంచే బాంబ్ షెల్టర్ల నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ సన్నద్ధతను మరింత వేగవంతం చేసింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా ఇటీవల మాట్లాడుతూ, ” ప్రజలు యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ఈ మార్గదర్శకాలు నిత్యం పొంచివున్న యుద్ధభయాలకు ప్రజలను మానసికంగా సిద్ధంగా ఉంచేలా చేస్తాయి ఈ సూచనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి కాకుండా, వారిని సంసిద్ధులను చేయడానికి ఉద్దేశించినవని అంటున్నారు. కొందరు దీన్ని అవసరమైన జాగ్రత్తగా భావిస్తే, మరికొందరు మాత్రం భయాందోళనలు సృష్టించే చర్యగా అభివర్ణిస్తున్నారు.