- ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ
- అనంతరం తగు చర్యలు ఉంటాయని వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. అనంతరం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో దాన్ని శాసనసభ, శాసనమండలి ముందు పెట్టి స్వేచ్ఛగా అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
665 పేజీల నివేదిక…
- జస్టిస్ ఘోష్ కమిషన్ మార్చి నెల 31 వ తేదీన 665 పేజీలతో కూడిన సుదీర్ఘమైన నివేదికను ప్రభుత్వానికి అందించింది. దానిపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సమగ్రంగా విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక అందించింది. మొత్తం నివేదికతో పాటు అధికారుల కమిటీ సంక్షిప్త నివేదికను మంత్రిమండలి ఆమోదించింది.
- మేం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రాజెక్టుపై న్యాయ విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ నియమించాం. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు, ఆనాటి నీటి పారుదల మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులు, ఎంతో మంది నుంచి సమగ్రమైన సమాచారం సేకరించిన మీదట నివేదిక ప్రభుత్వానికి అందజేశారు.
- 2007-08 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా, రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు పేరు, స్థలం మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.
- 2015-16 లో మొదలు పెట్టిన ప్రాజెక్టు 2018 లో పూర్తయినట్టు ప్రకటించారు. నిర్మించిన మూడేళ్లలోపు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలిపోగా… అన్నారం, సుందిళ్ల పగుళ్లు రావడం, దానిపై ఆనాటి ప్రభుత్వ హయాంలోనే సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్ఏ ప్రతినిధి బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టి నివేదిక అందజేసింది.
- ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాల పునాదులపై వేసిన ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. కమిషన్ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. పూర్తిగా స్వతంత్ర న్యాయ కమిషన్ ఇచ్చిన నివేదిక. రాజకీయ కక్షలకు తావులేదు.
- ఈ మూడు బ్యారేజీల నిర్మాణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక నిర్ణయం.
- తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పడం నిజం కాదు.
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదని అప్పట్లోనే నిపుణుల కమిటీ నివేదించగా, ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కిపెట్టారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, లోపభూయిష్టమైన డిజైన్లు, లోపభూయిష్టమైన నిర్మాణం, ఆపరేషన్ – నిర్వహణ లోపం.
- మాన్యువల్స్ లేవు. ఒప్పందాలు లేవు. పూర్తయినట్టు చట్ట విరుద్ధమైన సర్టిఫికేట్ల జారీ. బ్యాంకు గ్యారెంటీల విడుదల
- సరైన ప్రణాళికలు లేకపోవడం, తప్పుడు అంచనాలు, చట్ట విరుద్ధమైన ఆమోదాల వంటి ప్రతి దశలోనూ అవకతవకలు.
- బ్యారేజీల నిర్మాణంపై నోట్ ఫైల్ తప్ప మంత్రిమండలి ఆమోదం లేదు.
- చట్ట విరుద్ధమైన కాంట్రాక్టులు, సవరించిన అంచనాలు.
- సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యం కారణంగా భారీగా ప్రజాధనం వృధా.
- ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులు. తన్నీరు హరీష్ రావు కూడా బాధ్యులే.
- ప్రాజెక్టు నిర్మాణంలో విచ్చలవిడి అవినీతి, ఆర్థిక పరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయి.
- అదనపు పనులన్నీ నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది.
- కొందరు అధికారులూ ఇందుకు బాధ్యులే. తప్పుడు సాక్ష్యాలు సమర్పించారు. బాధ్యులైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలి.