- కళతప్పిన గద్దర్ ఫిలిం అవార్డ్ ఫంక్షన్
- సొంత ఫంక్షన్లకు అనేకమంది స్టార్లు వస్తే…
- ప్రభుత్వ కార్యక్రమానికి తీసుకురాని దుస్థితి
- పెద్ద నిర్మాత స్థాయి ఇంతేనా అన్న విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు… తన సొంత కార్యక్రమాలకు స్టార్ హీరోలను, ఇతర సినీ ప్రముఖులను సులభంగా రప్పించగల సత్తా ఉన్నవారు. అలాంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గద్దర్ అవార్డు ఫంక్షన్ కు స్టార్ హీరోలను రప్పించడంలో చేతులెత్తేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బ్రహ్మానందం సహా అనేకమంది హాజరు కాకపోవడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. వారిని రప్పించడంలో దిల్ రాజు విఫలమైనట్టు ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రప్పించడంలోనూ దిల్ రాజు ఫెయిలయ్యారు. అనేకమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పటికీ వారిని కూడా రప్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన పిలిస్తే రాని వారు ఎవరు అని అనేకమంది నిలదీస్తున్నారు.
లాభం ఉంటేనే వస్తారా?
గద్దర్ స్మృతిని గౌరవిస్తూ నిర్వహించిన ఈ అవార్డు ఫంక్షన్కు సినీ స్టార్ల గైర్హాజరీ తీవ్ర ఆవేదనను కలిగించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర తారలు తమ బిజీ షెడ్యూళ్లను సాకుగా చూపి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ‘సినీ హీరోలు తమ ఇమేజ్కు లాభదాయకం కాని సామాజిక కార్యక్రమాలకు హాజరుకారు. గద్దర్ వంటి మహోన్నత కళాకారుడి స్మృతిని కూడా వాణిజ్య కోణంలోనే చూశారా?’ అని సినీ విమర్శకులు, గద్దర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘దిల్ రాజు తన పరిచయాలు, స్టార్ ఇమేజ్ను ఉపయోగించి సినీ ప్రముఖులను రప్పించి ఉంటే, ఈ కార్యక్రమం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచేది. కానీ ఆయన నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల గద్దర్ స్మృతికి అగౌరవం జరిగింద’ని ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిల్ రాజు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని, ఈ ఘటన ఆయన అసమర్థతకు నిదర్శనమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
సినీ పెద్దలకు సీఎం పరోక్ష హెచ్చరికలు
గద్దర్ అవార్డు ఫంక్షన్కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… గద్దర్ జీవితం, ఆయన కళాత్మక ప్రస్థానం, సామాజిక సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. అయితే సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘గద్దర్ లాంటి గొప్ప కళాకారుడి స్మృతిని గౌరవించే కార్యక్రమానికి సినీ పెద్దలు రాకపోవడం బాధాకరం మాత్రమే కాదు, ఆయన సామాజిక ఉద్యమానికి చేసిన అవమానం’ అని సీఎం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆగ్రహం సినీ పెద్దలకు హెచ్చరికగా భావిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఒక కళంకం…
గద్దర్ అవార్డు ఫంక్షన్ తెలుగు సినీ పరిశ్రమలోని బాధ్యతారాహిత్యం, సామాజిక స్పృహ లేమిని మరోసారి బట్టబయలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. దిల్ రాజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఘోరంగా విఫలమవడం, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, ప్రభుత్వ వర్గాల విమర్శలు – ఇవన్నీ ఈ ఘటనను తీవ్ర వివాదాస్పదందంగా మార్చాయి. తెలుగు సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. గద్దర్ స్మృతిని గౌరవించడంలో సినీ పరిశ్రమ దారుణంగా విఫలమైంది