కాళేశ్వరం డబ్బుతో థాయిలాండ్ లో కుమారుడి పెళ్లి

  • కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్
  • హైదరాబాద్‌ తెల్లాపూర్‌లో విలాసవంతమైన విల్లా
  • షేక్‌పేట్‌లో 4,500 చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్
  • వరంగల్‌లో మూడు అంతస్తుల భవనం… 19 ప్రైమ్ రెసిడెన్షియల్ ప్లాట్లు
  • ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అవినీతి సామ్రాజ్యం
  • ఏసీబీ దర్యాప్తులో సంచలన విషయాలు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో తిష్ట వేసిందో ఏసీబీ దర్యాప్తులు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కావడం, ఈ కేసులో ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారుల పాత్రపై సంచలనం సృష్టిస్తోంది. శ్రీధర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించగా, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలను ధిక్కరించిన వైనం, ఇతర అధికారుల సహకారం ఈ అవినీతి సామ్రాజ్యపు లోతును తేటతెల్లం చేస్తున్నాయి.

శ్రీధర్ అవినీతి కట్టలు తెంచుకుందా?
నూనె శ్రీధర్… ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని గాయత్రి, నంది మేడారం పంప్ హౌస్‌ల బాధ్యతలను నిర్వర్తించారు. ఏసీబీ ఈనెల 11వ తేదీన శ్రీధర్‌కు సంబంధించిన 14 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి, రూ.200 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించింది. హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో విలాసవంతమైన విల్లా ఉంది. షేక్‌పేట్‌లో 4,500 చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్ ఉంది. కరీంనగర్‌లో మూడు ఫ్లాట్లు, మలక్‌పేట్‌లో నాలుగు అంతస్తుల భవనం, వరంగల్‌లో మూడు అంతస్తుల భవనం, 19 ప్రైమ్ రెసిడెన్షియల్ ప్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. కరీంనగర్‌లో హోటల్, భారీగా బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాదు శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఇంత భారీ ఆస్తులు ఎలా సమకూరాయి? ఇది కేవలం అక్రమ సంపాదన, బినామీ డీల్స్, ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో భారీ ఎత్తున జరిగిన అవినీతి ఫలితమేనని ఏసీబీ అనుమానిస్తోంది.

ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాల ధిక్కారం…
శ్రీధర్ కేసు ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారుల చిక్కుముడిని కూడా విప్పుతోంది. 2024 జూన్ 27న ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను శ్రీధర్ ఏ మాత్రం లెక్కచేయకుండా ఏడాది పాటు చొప్పదండిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా యథావిధిగా కొనసాగారు. ఈ సంచలన విషయం ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి రావడంతో, శ్రీధర్ ఈఎన్‌సీ (ఇంజనీర్-ఇన్-చీఫ్) అనిల్ ఆదేశాల మేరకే ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్వులను ధిక్కరించినట్లు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఎన్‌సీ అనిల్‌కు శ్రీధర్‌తో ఉన్న సంబంధాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలను కూడా ధిక్కరించేంత ధైర్యం శ్రీధర్‌కు ఎలా వచ్చింది? ఈ విషయంలో ఈఎన్‌సీ అనిల్ అండదండలు ఉన్నాయా? శ్రీధర్ అక్రమాస్తుల సంపాదనలో ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేపట్టండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *