- జీఎం సుధాకర్ రెడ్డిపై ఈడీ, ఓఎస్డీల పెత్తనం
- అవమానకరంగా నర్మెట్టకు బదిలీ…
- పెద్దలను నిలదీయడంతో నిలిచిన బదిలీ
- ఎండీ, జనరల్ మేనేజర్ మధ్య ఆ ఇద్దరు
- డమ్మీగా మారిన ఆయిల్ ఫెడ్ జీఎం… మానసిక వేదన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర పడింది. అంతేకాదు ఆయనకు ఘోర అవమానం జరిగింది. తద్వారా కార్పొరేషన్ జీఎం పోస్టును డమ్మీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకునే దానికంటే సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జనరల్ మేనేజర్ పోస్టు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎండీ తర్వాత కీలకమైన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి పర్యవేక్షణ చేస్తూ… ఎండీకి చేదోడు వాదోడుగా ఉండాలి. కానీ ఆ పోస్టుకు వన్నె తగ్గించి ఒక ఫ్యాక్టరీకే పరిమితం చేసే ప్రయత్నం జరిగింది.
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. పోస్టు లేనప్పటికీ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డిని అక్కడికి బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ఆయన ఉన్నత స్థాయి అధికారులను కలిసి నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆ బదిలీని నిలిపివేసినట్లు ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఈ బదిలీ కుట్రలో ఆయనతో సరిసమాన అనుభవం ఉన్న ఒక సీనియర్ అధికారి, అలాగే అనేక విషయాల్లో ‘ప్రావీణ్య’త కలిగిన ఇద్దరు అధికారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జనరల్ మేనేజర్ పోస్టును బలహీనపరచడం… ఆయిల్ ఫెడ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమేనని ఒక సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
జీఎం నెత్తిపై ఈడీ, ఓఎస్డీలు…
ఆయిల్ ఫెడ్ అత్యంత కీలక దశలో ఉంది. పామాయిల్ సాగును పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ఆ మేరకు కార్పొరేషన్ లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు నర్సరీలో మొక్కల పెంపకం… మరోవైపు రైతులను ఒప్పించి పామాయిల్ సాగు వైపు మరలించడం… ఇంకోవైపు ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అందుకోసం వందల కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు. కంటికి కోట్లు కనిపించడంతో అందరి కళ్ళు ఆయిల్ ఫెడ్ మీదనే పడ్డాయి. దీంతో ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన జనరల్ మేనేజర్ పదవిని డమ్మీ చేసి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని వ్యవసాయ శాఖలో కీలకమైన అధికారి దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది.
అందుకే ఎండీ, జీఎంల మధ్య మూడో వ్యవస్థను అనధికారికంగా సృష్టించారు. ఈడీ, ఓఎస్డీలను నియమించారు. ఆ కీలక అధికారి అండతో వాళ్ళిద్దరూ రెచ్చిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ కనుసన్నల్లోనే అన్నీ జరగాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. వారికి ఎక్కడా లేని విధంగా ప్రోటోకాల్, వసతి సౌకర్యాలు కల్పించారు. దీంతో జనరల్ మేనేజర్ పూర్తిస్థాయిలో డమ్మీగా మారారని విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నర్మెట్ట ఫ్యాక్టరీ పనుల పురోగతిని తెలుసుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్లను ప్రశ్నించినా… జీఎంను లెక్కచేయడం లేదని తెలిసింది. దీంతో ఆయన లబోదిబోమంటున్నారు. తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు. మరోవైపు ఐక్యంగా ఉండాల్సిన అధికారులు ఆధిపత్య పోరులో తలమునకలై ఉన్నారు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. దీంతో అధికారుల మధ్య గ్యాప్ పెరుగుతుంది.
నిఘా వ్యవస్థగా ఆ ఇద్దరు…
కొత్తగా నియమితులైన ఈడీ, ఓఎస్డీలు పై స్థాయి అధికారికి ప్రతిదీ మోయడం కోసమేనని ఆయిల్ ఫెడ్ లోని సీనియర్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ‘మేము ఏం చేస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? ఇవన్నీ ఆ ఇద్దరూ నిఘా నేత్రాలుగా వ్యవహరిస్తున్నారు. నేను చేసే ప్రతి దాన్ని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ల అనుభవంతో పనిచేస్తుంటే అడ్డుపడుతున్నారు. వాళ్లకు తెలియడం లేదు… చెప్తే పట్టించుకోవడం లేదు… దీనివల్ల కీలకమైన దశలో ఉన్న అనేక పనులకు ఆటంకం కలుగుతుంది. ఈడీ, ఓఎస్డీల వ్యవస్థను మాపై రుద్దటాన్ని వ్యతిరేకిస్తున్నాం. వీరిని నియమించిన ఒక కీలక వ్యక్తి అనేక పథకాలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ను భ్రష్టు పట్టించడానికే కుట్ర జరుగుతుంద’ని ఆ సీనియర్ అధికారి నిప్పులు చెరిగారు.
ఏమీ చేయలేకపోయిన ఎండీ…
ఆయిల్ ఫెడ్ లో ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎండీగా పనిచేసిన యాస్మిన్ బాషా ఏమీ చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులకు చెప్పలేక… ఆయిల్ ఫెడ్ లో ఉన్న కీలక వ్యక్తుల ఒత్తిడి తట్టుకోలేక ఆమె మిన్నకుండిపోయినట్టు తెలిసింది. ఐఏఎస్ అధికారిగా ఉండి కూడా ఆమె రాజకీయ ఒత్తిడులకు గురైనట్టు చర్చ జరుగుతుంది. ఈడీ, ఓఎస్డీల పెత్తనాన్ని ఆమె అడ్డుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే చిన్నస్థాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవహారాల్లో కూడా ఆమె జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏడు నెలల కిందట ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిని బదిలీ చేశారు. కానీ ఆ ఉద్యోగి చేరేలోగా… ఆ సంస్థలో ఉన్న ఒక పొడవాటి వ్యక్తి అడ్డుకొని తీయించేశారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమె మాటకు ఏమాత్రం విలువ లేదన్న విమర్శలు వచ్చాయి.