జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

  • విమాన ప్రమాదం… శర్మిష్ఠ జోస్యంపై ఆగ్రహం
  • పాపులారిటీకి వాడుకుంటున్న నీచత్వం
  • పైశాచిక ఆనందం పొందుతున్న జ్యోతిష్యులు
  • జ్యోతిష్యం చెప్తున్నారా? చేతబడి చేస్తున్నారా?

సహనం వందే, హైదరాబాద్:
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. జ్యోతిష్యం అంటే రాబోయే అనర్థాలను గుర్తించి వాటికి పరిష్కారాలను వెతకడంగా ఉండాలి. విమాన ప్రమాదం ముందే జరుగుతుందని శర్మిష్ఠ చెబితే… ఆ విమానాన్ని ఆపేవారు కదా. దానిలోని లోపాలను గుర్తించేవారు కదా. మరి ఆమె ఎందుకు చేయలేకపోయింది? ఈ ప్రమాదం జరగడం తనకు కలిసి వస్తుందని ఆమె అనుకొని ఉన్నారా? ఆమె చేష్టలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 241 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతే జ్యోతిష్కురాలు తన జోస్యం నిజమైందని చెప్పుకోవడం పైశాచికత్వానికి పరాకాష్ట.

సోషల్ మీడియాలో చీవాట్లు..‌.
జ్యోతిష్కురాలు శర్మిష్ఠ… జూన్ 5న చేసిన ఒక ట్వీట్‌లో 2025లో విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఏవియేషన్ రంగంలో అస్థిరత ఉంటుందని పేర్కొంది. ‘జూపిటర్ మృగశిర, ఆర్ద్ర నక్షత్రాలలోకి ప్రవేశించడం వల్ల విమాన రంగంలో పురోగతి ఉంటుంది. కానీ భద్రత, రక్షణలో లోపాలు ఉంటాయంటూ’ అస్పష్టమైన జోస్యం చెప్పింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదంలో 241 మంది మరణించిన తర్వాత చెలరేగిపోయింది. ‘ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. జూపిటర్ ఇంకా ఆర్ద్రలోకి ప్రవేశించలేదు. భారతదేశం మార్స్ మహాదశ ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ ఇంత జరిగిందంటూ’ ఈ దుర్ఘటనను తన అస్పష్టమైన జోస్యానికి ముడిపెడుతూ ఒక పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించింది. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతుంటే, అటువంటి దుర్ఘటనను తన జ్యోతిష్య నైపుణ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఉపయోగించుకోవడం అమానుషమని నెటిజెన్లు విమర్శిస్తున్నారు. కొందరు ఆమె జోస్యాన్ని పొగిడినప్పటికీ, ఎక్కువమంది ఆమె వ్యాఖ్యలను ఖండించారు. జ్యోతిష్యం గ్రహాల, నక్షత్రాల కదలికల ఆధారంగా భవిష్యత్తును ఊహించే ఒక సంప్రదాయ పద్ధతి.

జ్యోతిష్యం మైండ్ గేమ్…

  • శాస్త్రీయ పరిశోధనలు జ్యోతిష్యాలకు ఆధారాలను కనుక్కోలేదు. గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితంపై ప్రభావం చూపుతాయనే దానిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. షాన్ కార్ల్‌సన్ అధ్యయనం… జోస్యాలు యాదృచ్ఛిక అంచనాలు మాత్రమేనని చెబుతుంది.
  • బర్నమ్ ఎఫెక్ట్ థియరీ: జోస్యాలు తరచూ అస్పష్టంగా, సాధారణంగా ఉంటాయి. ఇవి ఎవరికైనా వర్తించేలా అనిపిస్తాయి. ఇదే ‘బర్నమ్ ఎఫెక్ట్’ థియరీ అంటారు. ప్రజలు ఈ సాధారణ అంచనాలను తమకు ప్రత్యేకంగా వర్తించినట్లు భావిస్తారు. శర్మిష్ఠ జోస్యం కూడా దీనికి మినహాయింపు కాదు. విమాన రంగంలో భద్రత, రక్షణలో లోపాలు అనే అస్పష్టమైన జోస్యం తాజా విమాన ప్రమాదానికి కారణంగా చెప్తుంది.
  • ఖగోళ శాస్త్రంతో వైరుధ్యం: జ్యోతిష్యం ఆధారంగా ఉన్న గ్రహ స్థానాలు ఆధునిక ఖగోళ శాస్త్రంతో సరిపడవు. భూమి ప్రిసెషన్ కారణంగా రాశుల స్థానాలు మారినా, జ్యోతిష్యం పాత గణనలనే ఉపయోగిస్తుంది.
  • జ్యోతిష్కుల మధ్య అస్థిరత: ఒకే జన్మ చార్ట్‌ను వివిధ జ్యోతిష్కులు విశ్లేషించినప్పుడు వారి జోస్యాలు భిన్నంగా ఉంటాయి. ఇది జ్యోతిష్యం ప్రామాణికత లేని ఒక ఊహాజనితమైన వ్యవస్థ అని స్పష్టం చేస్తుంది.
  • మానసిక ఆసరాగా జ్యోతిష్యం: శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ జ్యోతిష్యం అనేక కారణాల వల్ల ప్రజాదరణ పొందింది. భవిష్యత్తు గురించి జ్యోతిష్యం మానసిక భరోసాను అందిస్తుంది. సాంస్కృతిక వారసత్వంగా కూడా ఇది చాలా దేశాలలో కొనసాగుతోంది. అయితే శర్మిష్ఠ వంటి వ్యక్తులు ఈ నమ్మకాన్ని, మానసిక బలహీనతను ఆసరాగా చేసుకుని, విషాదాలను కూడా తమ జోస్యం నిజమైందని నిరూపించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.
Vijay Rupani

ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన 12-06-2025న విమాన ప్రమాదంలో మరణించిన తేదీ. అంటే 12/06. విచిత్రం ఏంటంటే ఆయన లక్కీ నంబర్ కూడా 1206నే. ఈ నెంబర్ ను తన వద్ద ఉన్న అన్ని వాహనాలకూ పెట్టుకున్నారు. రూపానీ కారు నంబర్ 1206. తాను మొదటి నుంచి వాడిన స్కూటర్లు కూడా ఇదే నంబరుతో ఉన్నాయట. ఈ ప్రమాదం కూడా జూన్ 12న జరిగింది. ఆయన లక్కీ నంబరే ఆయన అంతిమ ప్రయాణ తేదీగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *