- వరుస కథనాలతో యాస్మిన్ బాషా మార్పు
- సంస్కరణలకు మంత్రి తుమ్మల శ్రీకారం
- తిరుమలేష్ అదనపు బాధ్యతలకు కత్తెర!
- జొన్న సత్యనారాయణకు ఏదో ఒకటి
- అక్రమాల్లో ‘ప్రావీణ్యు’డికీ వేటు తప్పదా?
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషాను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూస్తుండటం… వాటిని నియంత్రించలేదన్న విమర్శలు రావడం… అనేక అదనపు బాధ్యతలు ఉండటం… తదితర కారణాలతో యాస్మిన్ బాషాను తప్పించి పూర్తిస్థాయి ఎండీగా శంకరయ్యను నియమించింది. ఆయిల్ ఫెడ్ లో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లు వరుస కథనాలు ప్రచురించాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఎండీ యాస్మిన్ బాషా కార్యాలయంలో లేకపోవడం యాదృచ్ఛికమా? లేదా కావాలనే జరిగిందా తెలియడం లేదు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. సహనం వందే, ఆర్టికల్ టుడే (sahanamvande.com & articletoday.in)పేపర్లలో వస్తున్న కథనాలు… అందులోని అక్రమాల వివరాలతో బాధ్యులను గుర్తించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు యాస్మిన్ బాషా కార్పొరేషన్ కు సమయం ఇవ్వడం లేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది.
ప్రక్షాళనపై మంత్రి దృష్టి…
ఆయిల్ ఫెడ్ పై సహనం వందే, ఆర్టికల్ టుడేలలో వస్తున్న కథనాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ సంస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో మొదటి స్టెప్ ఎండీని మార్చడం. ఆ తర్వాత సంస్థలో అనేక నంస్కరణలు చేయాలని మంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా నాలుగు కీలక విభాగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న తిరుమలేశ్వర్ రెడ్డిపై కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు ఏదో ఒక విభాగాన్ని మాత్రమే ఉంచే అవకాశం ఉన్నట్టు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అలాగే జొన్న సత్యనారాయణ చేతిలో ఉన్న రెండు విభాగాలలో ఒకటి తొలగించి మరొకటి ఇతరులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అక్రమాల్లో ‘ప్రావీణ్యం’ పొందిన… ‘సిరికాంతు’లతో వర్ధిల్లుతున్న వారి పైన కూడా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు కొత్త ఎండీకి ఆదేశాలు ఇస్తారని సమాచారం. ఎలాగైనా ఆయిల్ ఫెడ్ ను దారిలోకి తీసుకురావాలని… రైతుల నుంచి, సంబంధిత వర్గాల నుంచి ఎటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించే అవకాశం ఉంది.
సురేందర్ కు చుక్కెదురు…
మాజీ ఎండీ సురేందర్ మళ్లీ ఆయిల్ ఫెడ్ లోకి ప్రవేశించాలని తహతలాడినట్లు ప్రచారం జరిగింది. ఆ మేరకు ఆయన్ను తీసుకొచ్చేందుకు కొందరు పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. ఆ సంస్థలో కీలక స్థాయిలో పనిచేస్తున్న దాదాపు 40 శాతం మంది ఆయన రావాలని కోరుకున్నట్లు తెలిసింది. అయితే ఆయన పనిచేసిన కాలంలో ఆయిల్ పామ్ మొక్కలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలతో ప్రభుత్వం ఆయనను తిరిగి ఎండీగా నియమించడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. సురేందర్ కు మంత్రి తుమ్మలతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ… పలు విమర్శల కారణంగా ఆయనను ఎండీగా తీసుకురావడానికి కొందరు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.