- అమెరికన్ స్టాక్ మార్కెట్లో లక్ష కోట్లు నష్టం
- ఇండిగో, స్పైస్జెట్ షేర్లు కూడా పతనం
- బోయింగ్ విమానాల ఆర్డర్లు నిలిపివేత
- ఎయిర్ ఇండియా సీఈవో వెల్లడి…
సహనం వందే, అమెరికా:
అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటన… అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని అత్యంత విజయవంతమైన విమానాల్లో ఒకటైన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ భద్రతా రికార్డును తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే భద్రతా, ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న బోయింగ్ సంస్థకు ఈ ప్రమాదం మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ (నాస్డాక్)లో బోయింగ్ షేర్లు 6.5% నుండి 8% వరకు పడిపోయాయి. దీని ఫలితంగా సంస్థకు దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్జెట్ షేర్లపై కూడా ప్రభావం చూపింది. వీటి షేర్లు వరుసగా 2.5 శాతం, 3 శాతానికి పడిపోయాయి. ఎయిర్ ఇండియా సీఈఓ రాయిటర్స్తో మాట్లాడుతూ… బోయింగ్ నాణ్యత సమస్యలు గుర్తించే వరకు తమ సంస్థ బోయింగ్ విమానాల ఆర్డర్లు నిలిపివేస్తుందని ప్రకటించారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా తన ప్రతిష్టను మెరుగుపరచడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విమానయాన సంస్థగా మారడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఘటన సంస్థ భద్రతా ప్రమాణాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.