- డ్రగ్స్ వాడారా లేదా అన్న దానిపై సందేహాలు
- ఇరికించేందుకు కుట్ర దాగుందా అనుమానం
- ఊహించని పరిణామంతో మంగ్లీ బెంబేలు
సహనం వందే, హైదరాబాద్:
సింగర్ మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలనుకుని పోలీసులకు చిక్కిపోయారు. డ్రగ్స్, విదేశీ మద్యం ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబం బెంబేలెత్తిపోయింది. అయితే పుట్టినరోజు పార్టీలకు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి, మంగ్లీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడితే నేరంగా భావించి అరెస్టు చేయవచ్చు, జైలుకు కూడా పంపవచ్చు. కానీ పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కావాలని ఆమెని ఇరికించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆమె మందేసి చిందేస్తే అది ఆమె వ్యక్తిగతం. పబ్బుల్లో రోజూ వందల మంది మందేసి చిందేసి ఆడుతున్నా పట్టించుకునే నాధుడే లేడు కదా… మరి దీన్ని ఏమనాలి? వారు లైసెన్స్ తీసుకున్నారని చెప్తుంటారు. లైసెన్స్ తీసుకొని చెత్త చెత్తగా వ్యవహరించడం మన భారతీయ కల్చర్ అని అనుకోవాలా?
రిసార్ట్లో హంగామా… స్థానికుల ఫిర్యాదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో త్రిపుర రిసార్ట్ నుంచి పెద్దపెద్ద సౌండ్స్ వస్తున్నాయని, హంగామా చేస్తున్నారని స్థానికుల నుంచి కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు అందింది. రిసార్ట్లో పెద్ద ఎత్తున డీజే పెట్టి వేడుకలు జరుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమాచారంతో మహిళా ఎస్సై నేతృత్వంలో పోలీసులు త్రిపుర రిసార్ట్కు చేరుకున్నారు.
అనుమతులు లేకుండానే వేడుకలు…
పోలీసులు రిసార్ట్కు చేరుకోగానే అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. వీరంతా మద్యం మత్తులో డాన్సులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సింగర్ పుట్టినరోజు పార్టీ జరుగుతోందని, అయితే ఈ పార్టీకి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని రిసార్ట్ మేనేజర్ పోలీసులకు చెప్పాడు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు… ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ కూడా లేదని నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ కిట్ ద్వారా డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ఒకరు గంజాయి తీసుకున్నట్లు తేలింది. ఆమె అనుచరుడుగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించి, పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ అనంతరం పంపారు.
నలుగురిపై కేసు నమోదు…
అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ, ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్, ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్పైన కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.