ఎడిటర్ ధనుంజయరెడ్డి, సైమాల ఖండన
సహనం వందే, ఏలూరు:
ఆంధ్రప్రదేశ్లో సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు దుండగులు సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోగా, పార్కింగ్లో నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ నేతలు కక్షపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డి తీవ్రంగా ఖండించారు. దుండగులను పట్టుకొని శిక్షించాలని ఆయన పోలీస్ యంత్రాంగాన్ని కోరారు.
సైమా’ ఖండన…
మరోవైపు సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమా) అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు హైదరాబాదులో ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసనలు చేసే హక్కు ఎవరికైనా ఉందనీ… కానీ ఇలా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం సమంజసం కాదని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని సాక్షిపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు.