- కొమ్మినేని అరెస్టుతో జర్నలిస్టుల ఉలికిపాటు
- గతంలో ఎడిటర్ ధనుంజయ్ ఇంట్లో సోదాలు
- ఆ పత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్
- జాగ్రత్తలు తీసుకోకపోవడంపై జగన్ సీరియస్
- సాక్షి టీవీ ఉన్నత స్థాయి వ్యక్తులకు క్లాస్!
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి ఆదేశం?
సహనం వందే, అమరావతి:
సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఆ మీడియా సంస్థలో కలకలం చెలరేగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ సంస్థలోని జర్నలిస్టులు భయపడుతున్నారు. గత నెల సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇలా ఒకటి తర్వాత ఇంకొకటి సాక్షిలో కీలక వ్యక్తులు టార్గెట్ అవడంపై జర్నలిస్టులు కలవరపడుతున్నారు. ఏమి రాస్తే ఏం జరుగుతుందో అని సాక్షిలోని పలువురు విలేకరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు…
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఉదయం హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు… అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
సాక్షి కార్యాలయాల వద్ద నిరసనలు...
మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అరెస్టులు, నిరసనలను సాక్షి యాజమాన్యం ఖండించింది. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారని పేర్కొంది. ఆందోళనల పేరుతో విజయవాడ, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారని తెలిపింది. కొమ్మినేని అరెస్టును జగన్మోహన్ రెడ్డి ఖండించారు. 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేనిని అరెస్టు చేసి కక్షసాధింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
టీవీ బాధ్యులపై జగన్ సీరియస్…?
సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని ఆయన సాక్షి టీవీలోని పలువురు కీలక స్థాయి వ్యక్తులను మందలిచ్చినట్టు తెలిసింది. మహిళల పట్ల హుందాగా వ్యవహరించే లక్షణం లేని వారిని డిబేట్లకు ఎలా పిలుస్తారని ఆయన అన్నట్లు తెలిసింది. సాక్షి టీవీలో ఈ అంశానికి సంబంధించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. సాక్షి టీవీలో తీసుకోవాల్సిన చర్యలపై సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి పలు సూచనలు చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.
సాక్షిలో చర్చలు దారుణం: షర్మిల ఫైర్
సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటున్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి ఛానల్ డిబేట్ నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి టీవీ ఛైర్పర్సన్ భారతీరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ క్షమాపణ చెబితే సంతోషిస్తామని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై సాక్షి దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల విమర్శించారు.