డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం

కేఎంసీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు ప్రదానం

హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ (కేఎంసీ) 70 ఏళ్ల చరిత్రలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందిన మొదటి వైద్యుడిగా ఆయన ఘనత సాధించారు. మంగళూరులో జరిగిన ప్లాటినం జూబ్లీ కళాశాల దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును డాక్టర్ రఘురామ్‌కు అందజేశారు.

అత్యున్నత సేవలకు గుర్తింపు…

డాక్టర్ రఘురామ్ భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ సంరక్షణకు, దత్తత గ్రామంలో చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయనకు పద్మ అవార్డు, డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపరర్ వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయని గుర్తుచేశారు. ఈ అసాధారణ విజయాలకు గుర్తింపుగానే కేఎంసీ మంగళూరు చరిత్రలో తొలిసారిగా ఈ విశిష్ట అవార్డును ప్రదానం చేసిందని తెలిపారు.

మాతృసంస్థకు, తల్లిదండ్రులకు అంకితం…

అవార్డు అందుకున్న డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, తన ఆల్మా మేటర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఈ గౌరవం లభించడం వినయపూర్వకమైన అనుభవమన్నారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జూన్ 1995లో కేఎంసీ మంగళూరు నుండి విశ్వవిద్యాలయ పరీక్షల్లో తాను మొదటి స్థానం సాధించానన్నారు. ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రోగులు వైద్యులపై ఉంచే విశ్వాసం విలువైనదని, దానిని కాపాడుకోవాలని యువ వైద్యులకు సూచించారు. ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం చేసే ర్యాట్ రేస్ లో చిక్కుకోవద్దని హెచ్చరించారు.

సామాజిక బాధ్యత… గ్రామ దత్తత పిలుపు

తెలంగాణలోని ఒక మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్న తన అనుభవాన్ని వివరిస్తూ, దేశంలోని 6 లక్షల గ్రామాల అభివృద్ధికి పౌరులు తమ వంతు కృషి చేయాలని డాక్టర్ రఘురామ్ పిలుపునిచ్చారు. 6 లక్షల మంది ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటే, రాబోయే 25 ఏళ్ల గ్రామీణ భారతదేశంలో విప్లవాత్మక మార్పు సాధ్యమవుతుందన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *