ఆయిల్ ఫెడ్ లో ‘సిద్ధిపేట’ కుంభకోణం

  • నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో కోట్లు దోపిడి
  • అవసరానికి మించి అడ్డగోలుగా ఖర్చు
  • రూ. 20- 50 కోట్లతో ఫ్యాక్టరీ కట్టే బదులు…
  • రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్న ఆయిల్ ఫెడ్
  • ‘మనీం’దర్… ‘సిరి’కాంతుల కోట్ల దందా
  • 600 కోట్ల అప్పులు, నష్టాల్లో ముంచిన ఘనులు!
  • ప్రియూనిక్ కంపెనీకి అనఫిషియల్ సీఈఓగా ‘సిరి’కాంత్

ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు ఆకాశాన్ని అంటాయి. అందులో పని చేసే కీలక అధికారులే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక ఎండీ ఈ అక్రమాలకు తెర లేపగా… దాన్ని ప్రస్తుతం ఒక మేనేజర్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రూ. 100 కోట్లకు పైగా మెక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు ఆయిల్ ఫెడ్ ను నట్టేట ముంచేశారు. వారి దుర్బుద్ధి కారణంగా ఆయిల్ ఫెడ్ వందల కోట్ల రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయింది. దాని భవిష్యత్తును వారిద్దరూ ప్రశ్నార్థకంగా చేశారన్న విమర్శలు వస్తున్నాయి.

అవసరానికి మించి సిద్దిపేట ఫ్యాక్టరీ…

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుంది. 2021-22 నుంచి అన్ని జిల్లాల్లో ఈ పంటను సాగు చేయించాలని నిర్ణయించింది. గతంలో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకే పరిమితమైన ఆయిల్ పామ్ ను అన్ని జిల్లాలకు విస్తరించాలనేది ఉద్దేశం.భవిష్యత్తులో 20 లక్షల ఎకరాలకు ఈ పంటను సాగు చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. అంచనాలకు మించి ఈ లక్ష్యం ఉందని గతంలోనే విమర్శలు వచ్చాయి.కానీ ఈ మొత్తం వ్యవహారం వెనుక ‘మనీం’దర్ (పేరు మార్చాం) సూత్రధారిగా ఉన్నారు. దానికి ‘సిరి’కాంత్ (పేరు మార్చాం) పాత్రధారి అయ్యాడు. మరోవైపు సిద్దిపేటలో అవసరానికి మించి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. అక్కడ గంటకు 30 నుంచి 120 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఆయిల్ ఫెడ్ నిర్మిస్తోంది. ఆ ఫ్యాక్టరీ జోన్లో ఎఫ్ఎఫ్ బీ లభ్యత ఆ స్థాయికి దరిదాపులో లేదు. గత సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా తెలంగాణలో మొత్తం ఎఫ్ఎఫ్ బీ ఉత్పత్తి కేవలం 1,600 టన్నులు. ఈ సంవత్సరం ఎఫ్ఎఫ్ బీ మొత్తం దాదాపు 6000 టన్నులు ఉంటుంది. ఈ తక్కువ ఎఫ్ఎఫ్ బీ తో ఫ్యాక్టరీని నడపడం లాభదాయకం కాదని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి విమర్శించారు. వచ్చే పదేళ్లకు కూడా అక్కడ ఈ స్థాయిలో ఫ్యాక్టరీ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

గరిష్టంగా 15 టన్నుల సామర్థ్యం చాలు…
సిద్ధిపేటసిద్దిపేట చుట్టుపక్కల ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న తోటల నుంచి ఎంత వచ్చినప్పటికీ… అక్కడ 5 నుంచి 15 టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీ కడితే సరిపోతుందని నిపుణులు చెప్పినప్పటికీ అప్పటి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు. మహబూబాబాద్, జనగామ, భువనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి కూడా ఫ్రూట్ తీసుకొచ్చినప్పటికీ ఆ స్థాయిలో ఫ్యాక్టరీ అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ ఫ్యాక్టరీని కడుతున్న ప్రియూనిక్ కంపెనీ కూడా తన పరిధిలో ఉన్న తోటల కోసం వనపర్తిలో కేవలం 15 టన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీని మాత్రమే నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఆయిల్ ఫెడ్ మాత్రం అవసరానికి మించి 300 కోట్ల రూపాయలతో నిర్మించడం వెనక కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. అంతెందుకు గోద్రెజ్ కంపెనీ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం వద్ద కేవలం 15 టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీని మాత్రమే నిర్మిస్తుంది. అలాంటిది ఏం చూసుకుని సిద్దిపేటలో అంత సామర్థ్యం గల ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ ఫ్రీ యూనిక్ కంపెనీకి, మాజీ ప్రభుత్వ పెద్దకు, మనీందర్, సిరికాంతుల దోపిడీకి మాత్రమే నిర్మిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సిరికాంత్ ఫ్రీ యూనిక్ కంపెనీకి అనఫిషియల్ సీఈవోగా ఉన్నారని ఆయన చెప్పారు. అందులో పార్టనర్ గా కూడా ఉన్నాడని ఆయన విమర్శించారు ‌

ఫ్యాక్టరీలు నిర్మించని ప్రైవేట్ కంపెనీలు…
ఆయిల్ ఫెడ్ ఇష్టారాజ్యంగా వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాయి. తెలంగాణలో 13 ప్రైవేట్ పామాయిల్ ప్రాసెసింగ్ కంపెనీలకు జోన్లు కేటాయించారు. వారి తోటలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా ఏ కంపెనీ ఇప్పటివరకు ఫ్యాక్టరీలను నిర్మించడం లేదు. వారి తోటలు ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు వారు ఫ్యాక్టరీలను నిర్మించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే లాభదాయకమైన రికవరీని పొందలేమని వారికి తెలుసు. ఆయిల్ ఫెడ్ మాత్రం లాభదాయకంగా లేనప్పటికీ ఫ్యాక్టరీలను విచక్షణారహితంగా నిర్మిస్తోంది. ఇది ఆయిల్ ఫెడ్ ను భారీ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. 2019కి ముందు తెలంగాణ ఆయిల్ ఫెడ్ లాభాలతో ఉంది. కానీ ప్రస్తుతం అది రూ. 600 కోట్ల అప్పుల్లో ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక సిద్ధిపేటలో ఆయిల్ పామ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రకటించారు. కానీ అది అశాస్త్రీయం. ఎందుకంటే ముడి చమురు అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండే ఉత్పత్తి అవుతుంది. అప్పారావుపేట ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లులోనే రిఫైనరీని ఏర్పాటు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *