- మెడికల్ కాలేజీల యాజమాన్యాల గూండాగిరీ
- ఉపకార వేతనాల లూటీ… ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు
- ప్రశ్నిస్తే… ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులు
- అన్ని ప్రైవేట్ కాలేజీలకు నోటీసులు జారీ… పదో తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
సహనం వందే, హైదరాబాద్:
వైద్య విద్యార్థులపై ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆగడాలకు అంతే లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూల్ చేయడం… విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను కాజేయడం… ఇదేంటని ప్రశ్నిస్తే ‘మీ జీవితం మా చేతుల్లో ఉందం’టూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మెడికోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైద్య విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం, వారిని వేధిస్తున్న తీరుపై తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కన్నెర్ర చేసింది. ఏకంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వైద్య విద్యారంగంలో సంచలనం సృష్టిస్తున్న ఈ పరిణామం ప్రైవేటు కళాశాలల ఇష్టారాజ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఉపకార వేతనాల లూటీ…
ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు యాజమాన్యాల దౌర్జన్యాలకు బాధితులుగా మిగిలిపోతున్నారు. వారికి చెల్లించాల్సిన ఉపకార వేతనాలు మోసం జరుగుతుంది. విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఉపకార వేతనం మొత్తాన్ని జమ చేసి, ఆ తర్వాత కళాశాల యాజమాన్యాలు ఆ మొత్తాన్ని బలవంతంగా తిరిగి వసూలు చేస్తున్నాయి. ఇది విద్యార్థుల శ్రమను దోచుకోవడమే కాకుండా, పచ్చి మోసానికి పాల్పడటమేనని విద్యార్థులు మండిపడుతున్నారు. అంతేకాకుండా, ‘మీ జీవితం మా చేతుల్లో ఉంది’ వంటి ప్రకటనలతో కొంతమంది వైద్య కళాశాల అధికారులు విద్యార్థులను మానసికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు, ఫీజుల విషయంలో ఎటువంటి పారదర్శకత పాటించకపోవడం మరో పెద్ద అక్రమం. విద్యార్థుల ధృవపత్రాలు, ఇతర ముఖ్యమైన పత్రాలను నిలిపివేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం ఈ ప్రైవేటు కళాశాలల దౌర్జన్యానికి పరాకాష్ట.
పది రోజుల్లో వివరణ ఇవ్వాలని అల్టిమేటం!
ఈ అక్రమాలపై తక్షణమే వివరణ ఇవ్వాలని టీఏఎఫ్ఆర్సీ అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలను ఆదేశించింది. విద్యార్థులను మానసికంగా వేధించడం, బెదిరించడం, దోపిడీ, పారదర్శకత లేని ఫీజు పద్ధతులు, సర్టిఫికెట్లు, పత్రాలను నిలిపివేయడం వంటి అంశాలపై వివరణ కోరింది. అంతేకాకుండా విద్యార్థులకు చెల్లించిన స్టైపెండ్ వివరాలకు సంబంధించిన సమాచారాన్ని, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన మొత్తాన్ని రుజువులతో సహా ఈనెల 10వ తేదీ నాటికి సమర్పించాలని కూడా కళాశాలలను ఆదేశించింది.