- గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై బాధితుల ఆగ్రహం
- నిచ్చెనలు… గోడలను పగలగొట్టే పరికరాలు లేవు
- అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదు… వైద్య సేవల్లో వైఫల్యం
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్లో 18న ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య విభాగాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులను కోల్పోయామని ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సన్నద్ధత లేమి ఈ విషాదానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో అగ్ని భద్రతా విధానాలపై తీవ్ర చర్చను రేకెత్తించింది.
గంట వరకు ఫైర్ ఇంజన్లు రాలేదు…
గుల్జర్ హౌస్లో సంభవించిన అగ్నిప్రమాదానికి ప్రధాన కారణంగా షార్ట్ సర్క్యూట్ను అధికారులు పేర్కొన్నప్పటికీ… బాధితులు అగ్నిమాపక శాఖ సమయస్ఫూర్తి, సన్నద్ధత లోపాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సంతోషి గుప్తా మాట్లాడుతూ, ‘అగ్నిప్రమాదం జరిగిన గంట వరకు ఫైర్ ఇంజన్లు రాలేదు. వచ్చిన ఫైర్ ఇంజన్లలో నీటి సరఫరా, సరైన సామగ్రి లేవు. నిచ్చెనలు, గోడలను పగలగొట్టే పరికరాలు కూడా లేకపోవడంతో ఫైర్ సిబ్బంది భవనంలోకి ప్రవేశించలేకపోయార’ని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు ఉత్కర్ష్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘మొగల్పుర ఫైర్ స్టేషన్ కేవలం 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఫైర్ ఇంజన్ 6:35 నుంచి 6:40 గంటల మధ్యనే చేరుకుంది. మొదటి ఫైర్ ఇంజన్లో సరైన నీటి సరఫరా, టార్చ్లైట్లు, గేర్లు కూడా లేవు. స్థానికులే మొదట రక్షణ పనులు చేపట్టార’ని ఆరోపణలు చేశారు.
అంబులెన్స్లలో ఆక్సిజన్ లేదు…
అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించే క్రమంలో అంబులెన్స్లలో ఆక్సిజన్ సిలిండర్లు, అవసరమైన వైద్య సామగ్రి లేకపోవడం మరో తీవ్ర సమస్యగా బాధితులు పేర్కొన్నారు. సంతోషి గుప్తా మాట్లాడుతూ, ‘అంబులెన్స్లలో ఆక్సిజన్ లేకపోవడంతో మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఐదు నిమిషాలు త్వరగా స్పందించి ఉంటే, కనీసం కొందరినైనా కాపాడి ఉండేవార’ని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. ‘పోలీసు కేసు నమోదు కాకముందే చికిత్స చేయమని డాక్టర్లు నిరాకరించారు. దీంతో గాయపడినవారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాము. ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు మరణించార’ని సంతోషి గుప్తా వెల్లడించారు. ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్ వంటి రద్దీ ప్రాంతాల్లో అగ్ని భద్రతా విధానాలు, విద్యుత్ సరఫరా నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది. భవనంలో స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్యూషర్లు లేకపోవడం, ఒకే ఇరుకు ప్రవేశ ద్వారం ఉండటం వల్ల బాధితులు బయటకు రాలేకపోయారు.
న్యాయ విచారణకు డిమాండ్…
బాధిత కుటుంబ సభ్యులు ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సంతోషి గుప్తా మాట్లాడుతూ, ‘అధికారుల నిర్లక్ష్యం వల్ల మా కుటుంబంలో 17 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి. న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల’ని కోరారు. ఈ ఘటనలో మరణించిన 17 మందిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు.