- దళిత విద్యార్థులు బానిసలా?
- గురుకులాల్లో అమానవీయ పోకడలు
- ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి వింత పోకడ
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ తెచ్చేలా మారాయి. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యతను, గురుకుల విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను నగ్నంగా బయటపెట్టింది. దళితులు ఆధునిక (పోష్) మానవులు కాదని కేవలం బానిసలే (స్లేవ్స్) అని ఆమె అభిప్రాయంగా ఉంది.
టాయిలెట్లు కడుక్కోవడం తప్పా?
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోలో అలుగు వర్షిణి అహంకార పూరితంగా మాట్లాడిన తీరు విస్మయపరుస్తుంది. ‘గురుకులాల్లో చదివే పిల్లలు టాయిలెట్లు కడుక్కుంటే తప్పేంటి? వాళ్లు పాష్ సొసైటీ నుంచి వచ్చినవాళ్లు కాదు.

టేబుల్ వద్ద కూర్చుని అరిస్తే భోజనం వస్తుందనుకుంటే కుదరదు. స్వీపర్లు వచ్చి గదులు శుభ్రం చేయరు. విద్యార్థులే ఎందుకు చేయకూడదు?’ అని ఆమె దురహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దళిత విద్యార్థులను కించపరిచేలా ఉన్నాయి.
జమ్మికుంటలో విద్యార్థులతో చపాతీలు చేయించిన ఫొటోలు వచ్చినప్పుడు, ‘చేస్తే మంచిదే కదా’ అని సమర్థించిన ఆమె, ‘పిల్లలు గదులు శుభ్రం చేసుకోవడం తప్పా’ అని ప్రశ్నించారు.
షోకాజ్ నోటీసులతో బెదిరింపు…
అలుగు వర్షిణి వివాదాస్పద ఆడియోలో అధికార దుర్వినియోగానికి పరాకాష్టను చూపింది. విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తామని హెచ్చరించారు. ‘ఫిర్యాదు చేస్తే కుదరదు. ఇది నా ఆర్డర్’ అని అధికారులకు హుకూం జారీ చేశారు. విద్యార్థులు చపాతీలు చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, తమ గదులు, వాష్రూమ్లు శుభ్రం చేసుకోవాల్సిందేనని ఆదేశించారు. ‘స్కూళ్లకు వెళ్లినప్పుడు పిల్లలు బూజు కూడా దులపడం లేదు. ఇది వాళ్లకు ఎందుకు అర్థం కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
రాజకీయ కుట్ర అంటూ ఆరోపణ…
ఈ వివాదంపై స్పందించిన అలుగు వర్షిణి, తన ఆడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘గురుకులాల విషయంలో రాజకీయాలు చేయొద్దు. ఆధారాలు లేని ఆరోపణలు సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. ‘విద్యార్థులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వారి బాధ్యత అని’ సమర్థించుకున్నారు.